Begin typing your search above and press return to search.

వైసీపీలో హాట్ హాట్ : సీనియర్లకు పెద్ద దండమేనా...?

By:  Tupaki Desk   |   2 July 2022 11:30 PM GMT
వైసీపీలో హాట్ హాట్  : సీనియర్లకు పెద్ద దండమేనా...?
X
ఈ సీనియర్లు ఉన్నారే మనతో ఎక్కడా కలసిపోవడం లేదబ్బా. వారి పాతవాసనల రాజకీయాలతో ఇబ్బందిగా ఉందబ్బా. ఇది ప్రతీ పార్టీలోనూ ఉన్న సమస్యే. రాహుల్ గాంధీ అయితే కొత్త నెత్తురు కావాలని ఏకంగా అధ్యక్ష పీఠాన్నే అలిగి వదిలేశారు. టీడీపీలో లోకేష్ బాబుది అదే బాధ. యంగ్ స్టర్స్ తోనే తన ప్రయాణం అని ఒట్టేసుకుంటున్నాడు. ఇపుడు వైసీపీలో చూస్తే జగన్ ది అదే సీన్ అంటున్నారు. సీనియర్లు తన తండ్రి వైఎస్సార్ తో కలసి అడుగులు వేసిన వారితో అంత కలుపుగోలుగా జగన్ ఉండలేకపోతున్నారు అని ప్రచారం సాగుతోంది.

వారి వయసుల రిత్యా అనుభవం రిత్యా విలువ ఇవాల్సి ఉంటుంది. అలాంటపుడు తాను అనుకున్నది సాగదు. ఇటీవల మలివిడత మంత్రివర్గ విస్తరణలో సైతం యంగ్ క్యాబినేట్ అన్నారు. కొత్తవారితోనే అంతా నింపాలని చూశారు. కానీ తీరా ఆచరణలో చూస్తే సీనియర్లు కూడా అందులో చేరారు. ఇదంతా ఇష్టం లేకపోయినా ఒక్కోసారి అనివార్యం అయి చేయాల్సి వస్తోందిట. ఇపుడు ఇదే జగన్ పడుతున్న మధనం అంటున్నారు.

ఈసారికి ఇలా అయింది వచ్చే ఎన్నికల తరువాత అంతా జూనియర్లు, యంగ్ బ్లడ్ తోనే కధ నడపాలని జగన్ పక్కాగా డిసైడ్ అయ్యారని టాక్. దాని కోసం ఇప్పటి నుంచే భారీ కటింగ్స్ మొదలెట్టారని అంటున్నారు. ఈసారి జరిగే ప్లీనరీలో సీనియర్లకు కొన్ని షాకులు ఇచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ సేవలను పార్టీకి మాత్రమే ఉపయోగించుకుంటాను, ప్రత్యక్ష రాజకీయలకు ఇక స్వస్తివాచకం పలకాల్సిందే అని సుతిమెత్తగా వారిని నచ్చచెప్పేటట్లుగా జగన్ చెబుతారు అని అంటున్నారు.

అంతే కాదు, వారికి ఈ విషయంలో కొన్ని ఆప్షన్లు కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది. అదేంటి అంటే మీరు పోటీ చేయకపోయినా మీ వారసులకు కచ్చితంగా టికెట్ ఇస్తామని వారి వెనక మీరు ఉండి గెలిపించండి అని చెబుతారుట. ఇక సీనియర్లకు పార్టీలో పెద్ద పీట వేయడమే కాకుండా రాజ్యసభ మెంబర్స్ గా ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం ఇస్తారుట. అయితే వారు అలా పెద్ద మనుషులుగా అక్కడ ఉండాల్సిందే తప్ప మంత్రి పదవులు వగైరాల మీద అసలు ఆశలేవీ పెట్టుకోకూడదంతే.

ఇదిలా ఉంటే సీనియర్ల జాబితా ఒకటి వైసీపీలో చక్కర్లు కొడుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావులగో పాటు స్పీకర్ ధర్మాన సీతారామ్, ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణరెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రంగనాధరాజు, కరణం బలరాం, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారికి ఈసారితో మీ సేవలు ఇక చాలు అని ఒక పెద్ద దండమే పెట్టేస్తారు అని అంటున్నారు.

వీరిలో ఆనం రామనారాయణరెడ్డి అయితే తన దారి తాను ఇప్పటికే చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం నుంది నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు రాం కుమార్ రెడ్డిని ఈసారి పోటీలో ఉంచుతారు. అలాగే మంత్రులలో కొందరు ఇప్పటికే తమ రిటైర్మెంట్ మీద ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేశారు అంటున్నారు.

ఈ మధ్యనే చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లకాలం మనమే నాయకత్వం చేయాలంటే కుదిరే పనేనా అని ఒకింత వైరాగ్యంతో మాట్లాడారు. ఆయన కుమారుడు బొత్స సందీప్ ఈసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇక బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఇప్పటికే మాడుగులలో రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి కొడుకు మిధున్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వస్తారని అంటున్నారు.ఈ మధ్యనే నారాయణస్వామి కూతురు లక్ష్మి వైసీపీ పెద్దలను కలసి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి ఆమె బరిలో ఉంటారు అని అంటున్నారు.

ఇక మిగిలిన వారి కుటుంబాలలో వారసులు ఉంటే కనుక వారు సమర్ధులు అయితే కచ్చితంగా టికెట్ ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా ఉందిట. ప్లీనరీ వేదికగా ఆ విషయాలను సీనియర్ల చెవిన వేసి వారి వారసులకు రెండేళ్ళ ముందుగానే టికెట్లు ప్రకటించాలన్న ముందస్తు ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. తండ్రులు అధికారంలో ఉండగానే వారసులు జనంలో ఇప్పటి నుంచే తిరిగితే ఎన్నికలలో విజయం సులువు అవుతుందని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అంటున్నారు. చూడాలి మరి అందరు సీనియర్లూ ఈ బలవంతపు రిటైర్మెంట్ కి ఒప్పుకుంటారా లేక వేరే మార్గాలు చూసుకుంటారా అన్నది కూడా వైసీపీలో హాట్ హాట్ గా సాగుతున్న చర్చగా ఉంది మరి.