Begin typing your search above and press return to search.

కలెక్టర్ గా హిందూ మహిళ...పాక్ లో ఇదే తొలిసారి..!

By:  Tupaki Desk   |   9 May 2021 5:51 AM GMT
కలెక్టర్ గా హిందూ మహిళ...పాక్ లో ఇదే తొలిసారి..!
X
స్వాతంత్రం రాగానే దేశం రెండుగా చీలిపోయింది. జిన్నా నేతృత్వంలో ముస్లింల కోసం పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ముస్లిం రాజ్యం ఆవిర్భావం తర్వాత పాకిస్తాన్లోని లక్షలాది హిందువులు ఆ దేశాన్ని విడిచి భారతదేశానికి చేరుకున్నారు. అయితే దేశ విభజన సమయంలో భారత్ లోకి చేరుకోలేని ఎంతో మంది హిందువులు ఆ తర్వాత అక్కడే ఉండిపోయారు. ఆ దేశంలో మైనార్టీలుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.

పాకిస్థాన్లో నేటికీ హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులే. ఆ దేశంలోని ఎన్నో పురాతన హిందూ ఆలయాలు, చారిత్రక కట్టడాలు ముస్లింల దాడికి క్రమేణా తొలగిపోతూ వచ్చాయి. గత ఏడాది కూడా హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలోని ఆలయాలను ముస్లింలు ధ్వంసం చేశారు. పాకిస్తాన్ లో హిందూ జనాభా ఉన్నప్పటికీ, రాజకీయంగా వారికి ఉన్నత స్థానాలు ఎప్పుడూ లభించలేదు. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు కూడా ఎప్పుడూ ఎంపిక అయ్యింది లేదు. ఎక్కడ హిందూ మార్కు కనిపించకుండా అక్కడ పాలన సాగుతోంది. హిందువులకు హక్కులు మృగ్యం అయిన ఆ దేశంలో తొలిసారి ఓ హిందూ యువతి కలెక్టర్ గా ఎంపిక అయి సంచలనం సృష్టించింది.

పాకిస్తాన్ లో హిందువులు ఎక్కువగా నివసించే సింధ్ ప్రాంతంలో ఓ గ్రామీణ యువతి తొలిసారి సీసీఎస్( సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్) పరీక్షల్లో సత్తా చాటి పీఏఎస్ ( పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ) కు ఎంపికయింది.మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాగో, పాకిస్థాన్లో సీసీఎస్ పరీక్ష కూడా అలాగే నిర్వహిస్తారు. మన దేశంలో ఐఏఎస్ ఎలాగో పాక్ లో పీఏఎస్ అటువంటిదే.సింధ్ ప్రాంతానికి చెందిన సనా రామ్ చంద్ తొలిసారి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కు ఎంపికైంది. సనా దేశంలో తొలి హిందూ మహిళ కలెక్టర్ గా కానున్నారు.

సీసీఎస్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 18553 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 221 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో 79 మంది మహిళలు ఉన్నారు. సనా మొదట ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిలో ఉన్నారు. అయితే ఆమెకు సివిల్ సర్వీస్ లో చేరాలని ఆసక్తి ఉండడంతో వైద్య వృత్తికి దూరమై సీఎస్ఎస్ కు ప్రిపేర్ అయ్యింది. ఆ తర్వాత పరీక్షలకు హాజరై సత్తా చాటింది. పాకిస్థాన్ వంటి కరడుగట్టిన దేశంలో ఒక హిందూ యువతి పాలనాపరంగా అత్యున్నత స్థాయి అయిన కలెక్టర్ పోస్ట్ కు ఎంపిక కావడంపై అటు పాక్ లోనూ ఇటు ఇండియాలోనూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.