Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ‌ను విచారించండి.. కానీ.. హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

By:  Tupaki Desk   |   29 Jun 2022 3:28 PM GMT
ఎంపీ ర‌ఘురామ‌ను విచారించండి.. కానీ.. హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. న‌ర‌సాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు హైకోర్టులో కొంత ఊర‌ట ల‌భించింది. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు కొంత ఇబ్బందిక‌ర ప‌రిణామం కూడా ఎదురైంది. ఆయ‌న‌పై రాష్ట్ర స‌ర్కారు న‌మోదు చేసిన కేసుల్లో విచార‌ణ త‌ప్ప‌ద‌ని.. హైకోర్టు పేర్కొంది. అయితే.. ఒకే ఒక్క కేసు విష‌యంలో మాత్రం మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ర‌ఘురామ‌కు హైకోర్టులో కొంత తీపి.. కొంత చేదు అనుభ‌వం ఎదురైంది.

ఎంపీ రఘురామపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై రాష్ట్ర స‌ర్కారు కుట్ర కోణంలో న‌మోదు చేసిన‌ కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంపీ రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్‌ల కింద విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్‌ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది.

కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్‌ సమక్షంలోనే జరగాలని ఆదేశించిం ది.

కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది. సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన రాజద్రోహం కేసుపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామను సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ర‌ఘురామ వాద‌న ఇదీ..

హైకోర్టులో విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజద్రోహం(ఐపీసీ 124ఏ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురిచేయకుండా నిలువరించాలని కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో దానిని అడ్డుకోవడం కోసం ఉద్దేశ పూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి హాజరుకావాలని కోరుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసుపెట్టడం సరికాదని వాదనలు వినిపించారు.

ప్ర‌భుత్వం ఏమందంటే..

మరోవైపు సెక్షన్ 124(ఏ) అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆ సెక్షన్ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరపున ఏజీ తెలిపారు. మిగిలిన సెక్షన్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. పైవిధంగా ఉత్తర్వులిచ్చింది.