Begin typing your search above and press return to search.

రాష్ట్ర ఖ‌జానాకు బాబు బాగానే మంట‌పెట్టారే..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 5:30 PM GMT
రాష్ట్ర ఖ‌జానాకు బాబు బాగానే మంట‌పెట్టారే..!
X
విజ‌న్ ఉన్న‌నాయ‌కుడుగా పేరున్న చంద్ర‌బాబు.. త‌న పాల‌న‌లో పార్టీ నేత‌ల‌కు బాగానే దోచిపెట్టార‌ని..తాజాగా విడుద‌లైన ఓ నివేదిక స్ప‌ష్టం చేసింది. చంద్ర‌బాబు ఏపీని పాలించిన 2014-19 మ‌ధ్య కాలంలో అస్మ‌దీయుల‌కు ప‌రోక్షంగా ల‌బ్ధి చేకూర్చిన నేప‌థ్యంలో రాష్ట్ర ఖ‌జానా తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని.. తాజాగా విడుద‌లైన కాగ్ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ నివేదిక‌.. వైసీపీకి వ‌రంగా మార‌డం గ‌మ‌నార్హం. బాబు హ‌యాంలో మద్యం దందా ఇష్టారాజ్యంగా సాగిందని లెక్కకి మించి అక్రమాలు చోటు చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది.

ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. 2014–19 మధ్య బాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేదని చాలా కేసుల్లో పన్నులు సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

అయితే.. వైసీపీ నేత‌లు చెబుతున్న‌దానిని బ‌ట్టి.. ఆయా లైసెన్సులు మొత్తం.. టీడీపీ నేత‌లు, ఆ పార్టీ సానుభూతి ప‌రుల‌వేన‌ని. అందుకే చంద్ర‌బాబు మౌనంగా ఉన్నార‌ని.. ఇంత‌క‌న్నా.. రాష్ట్ర ఖ‌జానాకు చంద్ర‌బాబు చేసిన అన్యాయం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు.. ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. ఏదేమైనా.. ఇది రాబోయే రోజుల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ల మ‌ధ్య మాట‌ల మంట‌ను మ‌రింత‌గా ర‌గిలించ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇవీ.. కాగ్ చెప్పిన విష‌యాలు..
+ కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు.
+ ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు.
+ బీవీఎస్ డిస్టిలరీస్ విశాఖ డిస్టిలరీస్ పీఎంకే డిస్టిలరీస్ శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు.
+ మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
+ అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది.
+ దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది.
+ 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు.