Begin typing your search above and press return to search.

ఆమె జీతం రూ. 100 కోట్లు ..!

By:  Tupaki Desk   |   10 Jun 2021 7:30 AM GMT
ఆమె జీతం రూ. 100 కోట్లు ..!
X
గతంలో వేలలో జీతం అందుకుంటే దాన్నే చాలా గొప్పగా చెప్పుకునే వారు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు లక్షలు కాదు కోట్లలో జీతాలు అందుకుంటున్నారు. పెద్ద పెద్ద సంస్థల సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్‌ ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా డైరెక్టర్‌ సీమాపాటిల్‌. దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జీరోధాకి సీమాపాటిల్‌ డైరెక్టర్‌. ఒకప్పుడు ట్రేడింగ్‌ అంటే అదో రాకెట్‌ సైన్స్‌ అనుకునేవారు. జీరోధా పుణ్యమాని ఆ భావన మారింది. ఇప్పుడు అందరూ ట్రేడింగ్‌ లో సులభంగానే అడుగుపెడుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా యువతని ఈ రంగంలోకి ఆహ్వానించిందీ సంస్థ. ట్రేడింగ్‌ ఛార్జీల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లని అందివ్వడంతోపాటు, సాంకేతిక సాయంతో సులభంగా, తేలిగ్గా వాడుకోగలగడం జీరోధా యాప్‌ ప్రత్యేకత. అరకోటి వినియోగదారులున్న ఈ సంస్థని 2010లో సీమా భర్త నితిన్‌ కామత్‌ ప్రారంభించారు.

ఈ సంస్థలో తొలినుంచీ సీమా కీలక పాత్ర వహిస్తూ వస్తుంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ లో ఆరేళ్లు పనిచేసిన అనుభవం జీరోధాని ముందుకు నడిపించడానికి సహకరించిందామెకు. నితిన్‌ ఓ కాల్‌ సెంటర్‌ లో పనిచేస్తూ, జీరోధా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. నేను కూడా అక్కడే పనిచేసేదాన్ని. ఇంట్లో మా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు అమ్మానాన్నలు తను పనిచేసే రిలయన్స్‌ ఆఫీసుకెళ్లి వాకబు చేసి వచ్చారు. తను షేర్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతాడని తెలిసింది. పైగా కొత్తగా వ్యాపారం పెడుతున్నాడు అని తెలియగానే మా పెళ్లికి ససేమిరా అన్నారు. స్థిర ఆదాయం వచ్చే జాబ్‌ ఉంటే పెళ్లి అన్నారు. నాకు మాత్రం నితిన్‌ పై పూర్తి నమ్మకముంది. మొత్తంమ్మీద నితిన్‌, తన సోదరుడు నిఖిల్‌తో కలిసి జీరోధాని ప్రారంభించాంఅని చెప్తారు సీమా పాటిల్‌. తొలిరోజుల్లో హెచ్‌ ఆర్‌, క్వాలిటీ వ్యవహారాలు చూసే సీమా... పనివిధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులపై ఒత్తిడిని వీలైనంతగా తగ్గించాలనేది ఆమె ఆలోచన. లంచ్‌ విత్‌ సీఈవో వంటి వినూత్నమైన కార్యక్రమాలని చేపట్టారామె. ‘అందులో భాగంగా కొత్త ఉద్యోగులు, సీఈవోతో కలిసి భోజనం చేస్తూ సంస్థ లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. తాము సంస్థ నుంచి ఏం కోరుకుంటున్నామో నిస్సంకోచంగా సీఈఓకు చెప్పొచ్చు. మహిళలకు మాతృత్వ సెలవుల తర్వాత పాపాయిని వదిలి రావడం కష్టమనిపిస్తే ఇంటి నుంచే పని వెసులుబాటు కల్పించాం. మరికొంతమంది తల్లులు పసిపిల్లలతో ఉద్యోగానికి రాలేక చిన్నబ్రేక్‌ ఇచ్చి మళ్లీ రావాలనుకుంటారు. అటువంటి వారికీ స్వాగతం పలికాం. రెండు, మూడేళ్ల విరామం తర్వాత కూడా వాళ్ల ఉద్యోగాన్ని వాళ్లకు భద్రంగా అప్పగించడం వంటి ఎన్నో కీలక ముందడుగులు వేశారు. సన్‌టీవీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న కావేరీ కళానిధి అత్యధికంగా రూ. 88కోట్ల రూపాయల జీతాన్ని తీసుకునేవారు. ఇప్పుడామెని అధిగమించి సీమా ఏడాదికి 100 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటోంది. ‘ఇలాంటి ఆర్థిక సంస్థల్లో అమ్మాయిలు రాణించడం ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ, మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.