Begin typing your search above and press return to search.

రోజాకు జ‌గ‌న్ షాకిచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:30 AM GMT
రోజాకు జ‌గ‌న్ షాకిచ్చిన‌ట్టేనా?
X
ఆర్కే రోజా వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉండి 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నుంచి ఓట‌మి పాల‌యిన రోజా ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా నుంచి న‌గ‌రి నుంచి గెలుపొందారు. వైఎస్సార్సీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాటి సీఎం చంద్ర‌బాబు నాయుడుపైన‌, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ పైనా రోజా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబు కామ సీఎం అని, లోకేష్ ముద్ద‌ప‌ప్పు అని నిప్పులు చెరిగారు. రోజా వాగ్ధాటిని మెచ్చిన పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్.. రోజాకు వైఎస్సార్సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇందుకు త‌గ్గ‌ట్టే రోజా ఆ బాధ్య‌త‌ల్లో ఒదిగిపోయారు. చంద్ర‌బాబు, లోకేష్, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక రోజాకు కీల‌క మంత్రిత్వ‌శాఖ‌తో మంత్రిప‌ద‌వి ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆమెను వివిధ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆమెకు కేబినెట్ మంత్రి హోదాలో ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల క‌ల్ప‌న సంస్థ చైర్మ‌న్ (ఏపీఐఐసీ) బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో రోజా కొంత నిరాశ‌కు గుర‌యినా ఆ ప‌ద‌వితో స‌ర్దుకుపోయారు.

ఇంకోవైపు జ‌బ‌ర్ద‌స్త్ వంటి టీవీ ప్రోగ్రాముల్లోనూ సంద‌డి చేస్తూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆమెను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పించి మెట్టు గోవింద‌రెడ్డిని ఈ ప‌ద‌విలో నియ‌మించారు. జ‌గ‌న్ రోజాకు షాకిచ్చార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అప్ప‌టి నుంచి ఏ ప‌ద‌వి లేకుండా ఖాళీగా ఉన్న రోజాకు ఎట్ట‌కేల‌కు వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత జ‌రిగిన కేబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి ల‌భించింది. ప‌ర్యాట‌క, క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రిగా అంత‌గా పేరు, ప్రాధాన్యం లేని శాఖ‌నే ఆమెకు క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆర్కే రోజా వైఎస్సార్సీపీకి చేసిన‌దానికి ఆమె స్థాయికి ఇది త‌గింది కాద‌నే విశ్లేష‌కులు అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. హోం మంత్రి వంటి ప్రాధాన్య‌త వంటి శాఖ‌లు ఆమెకివ్వాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే ఏదో ఒక మంత్రి ప‌ద‌విలే అని రోజా కూడా స‌ర్దుకుపోయారు. ఓవైపు మంత్రిగా, మ‌రోవైపు వైఎస్సార్సీపీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా రెండు పాత్ర‌ల్లోనూ రోజా ఒదిగిపోయారు. అయితే.. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్ షాకిచ్చార‌ని చెబుతున్నారు.

తాజాగా రోజాను రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా త‌ప్పించారు. ఆ బాధ్య‌త‌ల‌ను చీరాల‌కు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత‌కు క‌ట్ట‌బెట్టారు. సునీత నోరు కూడా పెద్ద‌దే అయిన‌ప్ప‌టికీ రోజాతో పోలిస్తే అంత వాగ్ధాటి లేద‌ని అంటున్నారు. రోజా అయితేనే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌న వాగ్ధాటితో దుమ్ము లేప‌గ‌ల‌ద‌ని చెబుతున్నారు.