Begin typing your search above and press return to search.

వైసీపీని గుచ్చుతున్న హరీష్ ముళ్ళు....టీయారెస్ లో ఏం జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   30 Sep 2022 1:38 PM GMT
వైసీపీని గుచ్చుతున్న  హరీష్ ముళ్ళు....టీయారెస్ లో ఏం జరుగుతోంది...?
X
తెలంగాణా రాష్ట్ర సమితి వ్యవస్థాపకులలో ఒకరైన హరీష్ రావు టీయారెస్ అధినాయకుడు కేసీయార్ కి సొంత మేనల్లుడు. ఆయన ఒక దశలో కేసీయార్ తరువాత తానే నంబర్ టూగా పార్టీలో వెలిగే వారు. అయితే కేటీయార్ ఎంట్రీతో హరీష్ కూడా అందరి లాంటి సాధారణ నాయకుడిగా మారిపోయారు. అయినా సరే హరీష్ ప్రాధాన్యతను టీయారెస్ లో ఎవరూ తక్కువగా తీసుకోలేరు.

అయితే కేసీయార్ తరువాత ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు అంటే కేటీయార్ పేరే ఠక్కున బయటకు వస్తుంది. ఆ విధంగా పార్టీలో జరగాల్సిన సర్దుబాటు ఇప్పటికే జరిగిపోయింది అని అంటారు. అయితే ఎవరికైనా జీవిత ధ్యేయం ముఖ్యమంత్రి పదవే. దాంతో హరీష్ రావు ఎంతగా కాదనుకున్న ఆ అత్యున్నత పీఠం మోజు వీడేది కాదు అనే వారున్నారు.

ఇక టీయారెస్ లో అటు మేనల్లుడు, ఇటు కొడుకు ఇద్దరినీ బ్యాలన్స్ చేస్తూ కేసీయార్ జాగ్రత్తగానే కధ నడుపుతున్నారు అని ప్రచారంలో ఉంది. ఇక కేసీయార్ మరో అడుగు ముందుకేసి జాతీయ పార్టీని స్థాపిస్తున్నారు. ఈ జాతీయ పార్టీకి తనతో పాటుగా మోయడానికి మేనల్లుడు హరీష్ రావుని కూడా ఢిల్లీకి తీసుకెళ్తారని అంటున్నారు.

ఆ విధంగా పూర్తి స్థాయిలో కేటీయార్ కి లైన్ క్లియర్ చేయడం ఒక ఎత్తు అయితే జాతీయ రాజకీయాలో తనకు తోడు నీడగా సొంత మనిషి ఉంటారన్నది మరో ఆలోచనగా చెబుతున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు తెలంగాణాలో బలంగా టీయారెస్ ఉంది. అన్నీ కలసి వస్తే మూడవసారి కూడా గెలిచే వీలు ఉంది.

అయితే జాతీయ స్థాయి రాజకీయం అంటే చీకట్లో బాణం వేయడమే. దాని వల్ల ఏం జరుగుతుంది, ఏమి ఒరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. అందువల్ల హరీష్ రావుకి అలా వెళ్ళడం ఇష్టమా కాదా అన్న చర్చ కూడా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఒక్క రోజు తేడాలో హరీష్ రావు ఏపీ సర్కార్ మీద వరసబెట్టి విమర్శలు చేశారు.

అవన్నీ కూడా నేరుగా జగన్ కి తాకేవే. ఆయన తిరుపతి టూర్ కి తాను వెళ్ళినపుడు అక్కడ రైతులను కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది అంటే మూడు నాలుగు గంటలని చెప్పారని చెప్పి ఏపీ సర్కార్ మీద విమర్శలు చేయకనే చేశారు. ఇక తాజాగా ఏపీలో ఉపాధ్యాయులను అక్కడ ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోంది అని మరో ఆరోపణ చేశారు.

ఇలా ఏపీ మీద కేసీయార్ మేనల్లుడు విరుచుకుపడుతూంటే వైసీపీ నుంచి కూడా కౌంటర్ స్టార్ట్ అయింది. హరీష్ విమర్శలు అర్ధరహితమని సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. ఆయన విమర్శలు ఎల్లో గ్యాంగ్ ఎపుడూ చేసేవే అని ఆయన అంటూ ఆ గాటిన కట్టేశారు. హరీష్ విమర్శలను టీయారెస్ విమర్శలుగా తాము చూడమని, అవి పూర్తిగా ఆయన వ్యక్తిగతమని కూడా చెప్పడం విశేషం.

ఆయనకు ఆయన మామకు ఏమైనా ఉంటే చూసుకోవాలి కానీ మధ్యలో మమ్మల్ని లాగడం ఎందుకు అన్నట్లుగా సజ్జల రామక్రిష్ణరెడ్డి మాట్లాడం ఇక్కడ పాయింట్. ఇక వైసీపీకి చెందిన మరో మంత్రి గుడివాడ అమరనాధ్ అయిఏ డైరెక్ట్ గా హరీష్ రావుని కేసీయార్ మనిషా లేక రామోజీరావు మనిషా అని అడిగేశారు. ఆయన సొంత పార్టీ సొంత రాష్ట్రం వ్యవహారాలు చూసుకోవాలని ఏపీ జోలికి రావద్దు అని కూడా సూచించారు.

మొత్తం మీద చూసుకుంటే హరీష్ రావు కి టీయారెస్ లో ఇబ్బందులు ఉన్నాయని, తాము రెచ్చిపోయి మాట్లాడితే ఆయన అందులో ఏదో లాభం చూసుకోవాలనుకుంటున్నాడని వైసీపీ నేతలు చెప్పడం బట్టి చూస్తే నిజమేనా అనిపించకమానదు. అంతే కాకుండా కేసీయార్ తో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అవుతోంది. ఇక ఈ మధ్యనే కేటీయార్ ఏపీలో తన సోదరుడు జగన్ పాలన బాగా ఉందని కితాబు ఇచ్చారు.

అంటే కేసీయార్ కేటీయార్ లతో వైసీపీకి మంచి బంధం ఉంది అన్న మాట. మధ్యలో హరీష్ ఎందుకు గుస్సా అవుతున్నారు, ఏపీలో వైసీపీ కేసీయార్ ల మధ్య లడాయి వస్తే ఎవరికి లాభం ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. ఏది ఏమైనా హరీష్ ని లైట్ తీసుకుంటామని చెప్పడమే కాకుండా ఆయన్ని ఎల్లో గ్యాంగ్ జట్టులో వైసీపీ నేతలు కట్టేయడం చూస్తే టీయారెస్ లో ఏదో జరుగుతోందా. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.