Begin typing your search above and press return to search.

ఆమె శాపం ఫ‌లించేనా.. శివ‌సేన ప్ర‌భుత్వానికి ఈ క‌ష్టాలు!

By:  Tupaki Desk   |   25 Jun 2022 5:30 AM GMT
ఆమె శాపం ఫ‌లించేనా.. శివ‌సేన ప్ర‌భుత్వానికి ఈ క‌ష్టాలు!
X
ఇప్పుడు ఇదే అంశంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్ర‌ముఖ న‌టీమ‌ణి కంగ‌నా ర‌నౌత్ శాపం ఫ‌లించే శివ‌సేన ప్ర‌భుత్వం కూలిపోయే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని అంటున్నారు. గ‌తంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానికి సంబంధించి కంగ‌నా ర‌నౌత్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌లేద‌ని.. అత‌డిని హ‌త్య చేశార‌ని కంగ‌నా ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ వ్య‌వ‌హారంలో బేబీ పెంగ్విన్ (మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముద్దుపేరు) ఉన్నాడ‌ని కంగ‌నా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. కొంత‌మంది బాలీవుడ్ మాఫియా, రాజ‌కీయ నేత‌లు క‌లిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హ‌త్య చేశార‌ని కంగ‌నా ర‌నౌత్ ఆరోపించింది.

కొత్త‌గా ఎవ‌రైనా బాలీవుడ్ లో ప్ర‌వేశించాల‌నుకున్నా, ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండా ఎదిగినా వారిని నిర్ధాక్షిణ్యంగా అణ‌చివేస్తార‌ని.. ఈ క్ర‌మంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానికి కార‌కుల‌య్యార‌ని కంగ‌నా ర‌నౌత్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కుమారుడిని కంగ‌న లక్ష్యంగా చేసుకోవ‌డంతో ఆమెకు శివ‌సేన ప్ర‌భుత్వం నుంచి చిక్కులు ఎదురయ్యాయి. ఆమె నిర్మించుకున్న ఆఫీసుకు ముంబై న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్పొరేష‌న్ అనుమ‌తి తీసుకోలేద‌ని ఆరోపిస్తూ అధికారులు ఇంటిని కూల్చివేశారు. దీంతో కంగ‌నా బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. బాంబే హైకోర్టు కంగ‌న‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఆ సంద‌ర్భంగా సీఎం ఉద్ధవ్ పై కంగ‌నా ర‌నౌత్ హాట్ కామెంట్స్ చేశారు. నా ఇల్లు కూల్చేసి పగ తీర్చుకున్నానని ఉద్దవ్ అనుకుంటున్నారు. నా ఇంటిని కూల్చేశారు.. రేపు మీ అహంకారం ఇలానే కూలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇది గుర్తుంచుకోండి అంటూ ఉద్ధవ్ పై కంగనా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

2020 సెప్టెంబర్ 9 న ముంబయిలోని పాలీ హిల్స్ లో ఉన్న కంగనా రనౌత్ ఆఫీస్ ను అక్రమంగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంత వరకు కూల్చివేశారు. ఇప్పుడు ఏక‌నాథ్ షిండ్ తిరుగుబాటుతో శివ‌సేన ప్ర‌భుత్వం చిగురుటాకులా వ‌ణుకుతోంది. ఈ నేప‌థ్యంలో కంగ‌న శాపం ఫ‌లించింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.