Begin typing your search above and press return to search.

వైసీపీ హైకమాండ్ కొట్లాట.. ఆర్టికల్ కు 3-5 వేలు?

By:  Tupaki Desk   |   1 Jun 2020 5:45 AM GMT
వైసీపీ హైకమాండ్ కొట్లాట.. ఆర్టికల్ కు 3-5 వేలు?
X
సీఎం జగన్ పాలనతో బిజీగా ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ హైకమాండ్ లో కొందరు కీలక వ్యక్తులు మాత్రం చీటికి మాటీకి ఆధిపత్య పోరుతో కొట్లాటలకు దిగుతున్న వైనం విస్తుగొలుపుతోంది. జగన్ ఎంత సర్దుబాటు చేసుకోమన్నా నేతలు పెడచెవిన పెడుతూ కొట్లాడుకుంటున్న తీరు ప్రతిపక్ష టీడీపికి వరంగా మారుతోందట.. ఈ కొట్లాటను రికార్డ్ చేసి ప్రధాన వెబ్ సైట్లకు డబ్బులిచ్చి మరీ అభాసుపాలు చేస్తున్న వైనం చర్చనీయాంశమవుతోంది. సీఎం జగన్ ఎంత పట్టుదలతో, పేదలకు సేవ చేయాలని ముందుకెళ్తున్నా హైకమాండ్ లోని కొందరి వల్ల ఆయన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోందని.. పాలనను చూస్తున్న జగన్.. పార్టీపై నజర్ వేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీ హైకమాండ్ లో పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చి ఒకరి మీద ఒకరు సీఎం జగన్ కు ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. సీఎంకు హైకమాండ్ లోని ఇద్దరు కీలక వ్యక్తులు వెళ్లి కలిసి ఫిర్యాదు చేసినా సీఎం జగన్ పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. ఎందుకు అంటే పార్టీలో ఇలాంటివి సహజమని.. పార్టీలో సర్దుకుపోతాయని సీఎం పెద్దగా ఫిర్యాదులపై ఆసక్తి చూపించలేదని సమాచారం.

వైసీపీ హైకమాండ్ లో కొట్లాట ఎంత వరకు వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏది అయినా జరిగినా.. మెల్లిగా ఆ వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చి హైలెట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ మధ్య వాళ్ల కొట్లాటలను పట్టించుకోవడం లేదు అని తెలుస్తోంది. దీంతో వాళ్లు ఇక సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చూస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో వార్ చేపిస్తున్నారట.. అయినా అది మాస్ జనాలకు చేరువ కాదు కాబట్టి వైసీపీ కొట్లాట విషయాలు మాస్ జనాలకి వెళ్లాలని డిసైడ్ అయిన వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి, బద్ధ శత్రువు టీడీపీ పెద్ద స్కెచ్చే వేస్తోందట..

టీడీపీకి సంబంధించిన వెబ్ మీడియాలో ఆర్టికల్స్ వేయించాలని డిసైడ్ అయ్యిందట.. టీడీపీకి సంబంధించిన వెబ్ సైట్ లలో ట్రాఫిక్ ను బట్టి 2-5 వేల వరకు ఒక ఆర్టికల్ కు చెల్లించి రాయించి పోస్ట్ చేయిస్తున్నారని.. వైసీపీ హైకమాండ్ లో ఇంత పెద్ద ఎత్తున వార్ జరుగుతోందని ప్రచారం చేస్తోంది. టీడీపీ డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైసీపీ హైకమాండ్ పై వెబ్ సైట్లలో బురద జల్లుతున్న తీరును సీఎం జగన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయి వైసీపీ నేతలు కోరుతున్నారు.. లేదంటే పార్టీ పరువు పోయి ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.