Begin typing your search above and press return to search.

మేయర్‌, కమిషనర్‌ మధ్య గ్రీన్‌ బెల్ట్‌ చిచ్చు .. ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   23 July 2021 4:30 PM GMT
మేయర్‌, కమిషనర్‌ మధ్య గ్రీన్‌ బెల్ట్‌ చిచ్చు .. ఏం జరిగిందంటే ?
X
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ జి.సృజన మధ్య గత కొన్ని రోజులుగా విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారిద్దరి మధ్య గ్రీన్‌ బెల్ట్‌ ధ్వంసం అంశం ఆ విబేధాలు మరింతగా పెరిగేలా చేసింది. పెదగదిలి లోని మేయర్‌ ఇంటి వద్ద కారు పార్కింగ్‌ కోసం బుధవారం జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు గ్రీన్‌ బెల్ట్‌ లో చెట్లను తొలగించడాన్ని కమిషనర్‌ చాలా సీరియస్‌ గా తీసుకున్నారు. ఆ పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు విచారణ జరిపి నివేదిక అందించాలని చీఫ్‌ ఇంజనీర్‌ రవికృష్ణరాజు కి ఆదేశాలు జారీ చేశారు.

జీవీఎంసీ మేయర్‌ హరివెంకటకుమారికి, కమిషనర్‌ సృజనకు మధ్య మొదటి నుండి పెద్ద సఖ్యత లేదు. ఛాంబర్‌ కేటాయింపు నుండి మొదలుపెట్టుకొని , కరోనా సమయంలో మాంసం విక్రయాలపై నిషేధం, ఆస్తి పన్ను అంశం కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చడం, మురికివాడల అభివృద్ధి ప్లాన్‌ పై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం వంటి అంశాలపై ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు కొనసాగుతూన ఉన్నాయి. కొన్నాళ్లపాటు ఇద్దరూ వేర్వేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. దీనితో ఇద్దరి మధ్య పొరపచ్చాలు తగ్గిపోయాయి అని అందరూ భావించారు.

అయితే తాజాగా మేయర్‌ ఇంటి వద్ద కారు పార్కింగ్‌ వ్యవహారం ఇద్దరి నడుమ మరోమారు దూరం పెంచేలా ఉంది. పెదగదిలిలో నివాసం వుంటున్న మేయర్‌ హరివెంకటకుమారి తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మేయర్‌ నివాసానికి సమీపంలో బీఆర్‌ టీఎస్‌ రోడ్డుకు, సర్వీస్‌ రోడ్డుకు మధ్యలో సుమారు పది మీటర్లు వెడల్పున గ్రీన్‌ బెల్ట్‌ ఉంది. అయితే ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్‌ కు కేటాయించాలని మేయర్‌ కుటుంబం కోరిన సమయంలో జీవీఎంసీ అధికారులు వెనుకాముందూ ఆలోచించకుండా బుధవారం 150 మీటర్లు పొడవున గ్రీన్‌ బెల్ట్‌ ను జేసీబీలతో తవ్వేసి లెవెల్‌ చేసేశారు.

వాహనాల పార్కింగ్‌ కోసం ఎన్నో ఏళ్లుగా పెంచిన పచ్చని చెట్లను నరికేస్తుండడం చూసిన స్థానికులు కొందరు అదంతా వీడియోలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేశారు. ఈ విషయమై మేయర్‌ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆమె భర్త శ్రీనివాసరావు స్పందించారు.గ్రీన్‌ బెల్ట్‌ వద్ద కారు పార్కింగ్‌ ఏర్పాటుకు జీవీఎంసీ కమిషనర్‌ సృజన స్వయంగా ఏప్రిల్‌ 20న రూ.20 లక్షలతో వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టు చెప్పారు. కమిషనర్‌ ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా సర్వీస్‌ రోడ్డులో పార్కింగ్‌ కు అనుగుణంగా పనులు చేసేందుకు మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, గ్రీన్‌ బెల్ట్‌ ను ధ్వంసం చేయడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. తన అనుమతిని వక్రీకరించి గ్రీన్‌ బెల్ట్‌ ను ధ్వంసం చేసిన అధికారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఈని ఆదేశించినట్టు చెప్పారు.