Begin typing your search above and press return to search.

శ్రీలంక కొత్త అధ్యక్షుడు అంత డేంజరసా?

By:  Tupaki Desk   |   18 Nov 2019 1:32 PM GMT
శ్రీలంక కొత్త అధ్యక్షుడు అంత డేంజరసా?
X
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ ఎల్‌ పీపీ) అభ్యర్థి గోటాబయా రాజపక్ష విజయం సాధించిన సంగతి తెలిసిందే. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్షకు ఈయన సోదరుడు. శ్రీలంక చర్చిలో ఉగ్రవాదులు పేలుళ్లు జరిపిన తరువాత దేశం ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో జరిగిన ఈ ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లతో గోటాబయ గెలిచారు. స్థానికత అంశంతో ప్రజలను రెండుగా చీల్చి గెలిచారంటూ అక్కడి ఇతర పార్టీలు గోటాబయపై ఆరోపణలు చేస్తున్నాయి. సింహళులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గోటాబయకు అధిక ఓట్లు రావడం.. తమిళులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సాజిద ప్రేమదాసకు ఓట్లు రావడం ఈ చీలికకు అద్దం పడుతోంది. గతంలో ఎల్టీటీఈని అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన ఈయన్ను సింహళులు హీరోగా కీర్తిస్తారు. తమిళులను తీవ్ర వ్యతిరేకిస్తారన్న ముద్ర ఈయనపై ఉంది.

చైనా డామినేషన్‌కు చాన్స్

గొటాబయ గతంలో తన సోదరుడు మహేంద్ర రాజపక్స హయాంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. శ్రీలంక పొదుజన పెరమున పార్టీకి పూర్తిగా చైనా అనుకూల పార్టీఅన్న ముద్ర ఉంది. దీంతో మన పొరుగునే మరోసారి చైనా ఆధిపత్యం ఉంటుందని - ఇది భారత్‌ కు ఇబ్బందికరమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా అనుకూల నేత అధికారంలోకి రావడంతో భారత దేశ భధ్రతకు కీలకంగా ఉన్న సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయొచ్చన్న వాదన ఉంది.

మోదీ శుభాకాంక్షలు

అయితే, ఈ వాదనలతో సంబంధం లేకుండా శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన గొటాబయాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతానికి - గోటబయతో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మోదీ అన్నారు. బదులుగా గోటాబయ కూడా భారత్‌ కు - మోదీకి కృతజ్ఞతలు చెప్పి భారత్‌ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అక్కడా జాతీయవాదమే గెలిచింది..

ఈ ఎన్నికల్లో గొటాబయతో మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు సాజిత్‌ ప్రేమదాస అధికార పార్టీ అభ్యర్థిగా పోటీపడ్డారు. ప్రేమదాసపై 13 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గొటాబయ విజయం సాధించారు. గోటబాయకు 52.25 శాతం.. ప్రేమదాసకు 41.99 శాతం ఓట్లు వచ్చాయి. సింహళీయులు మెజార్టీగా ఉన్న జిల్లాలో ఆయన పైచేయి సాధించారు.

తమిళ వ్యతిరేకి

గతంలో శ్రీలంక రక్షణ శాఖ లెఫ్టినెంట్‌ కల్నల్‌ గా పనిచేసిన గొటాబయపై వివాదాస్పద నేతనే ముద్ర ఉంది. అయితే, ఎల్టీటీఈతో జరిగిన అంతర్యుద్ధాన్ని గొటాబయ క్రూరంగా అణచివేశారనే ఆరోపణలు ఉన్నాయి. సింహళ బౌద్ధులు ఆయనను ‘యుద్ధ హీరో’గా అభివర్ణిస్తే - మైనార్టీ తమిళులు మాత్రం ఆయనను వ్యతిరేకిస్తుంటారు.

చైనాతో చెట్టపట్టాలు

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తమకు ప్రధాన రుణదాత చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటానని గోటబయ గతంలో స్పష్టం చేశారు. చైనాకు శ్రీలంక ఇప్పటికే భారీగా బకాయిపడింది. మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా తరహా ఆర్థిక - భద్రత విధానాలను అనుసరించారు. చైనా రుణ సాయం పేరుతో శ్రీలంకను గుప్పిట్లో పెట్టుకుంది. లంకలో పలు పోర్టుల అభివృద్దినీ చైనా తన చేతుల్లోకి తీసుకుంది.

మరోవైపు ఎన్నికల్లో ఓటమి పాలైన సాజిత్ ప్రేమదాస భారత్ అనుకూలుడు. 1980లో భారత్ ఆర్మీ ట్రెయినింగ్ సెంటర్‌లో శిక్షణ పొంది - మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి‘డిఫెన్స్‌ స్టడీస్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేశారు ప్రేమదాస.