Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు తొలగనున్న ఇబ్బందులు

By:  Tupaki Desk   |   7 Dec 2021 10:52 AM GMT
వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు తొలగనున్న ఇబ్బందులు
X
కరోనా మహమ్మరి వ్యాప్తితో ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పేరుతో ఇంట్లో నుంచే వర్క్ చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల కొన్ని సౌలభ్యాలున్నా.. చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఇంట్లో ఉండి పనిచేసిన వాళ్లు మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. కరోనా ఉధృతి కాస్త తగ్గి.. మరోసారి కేసులు పెరుగుతుండడంతో వర్క్ ఫ్రం హోం వైపు కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గాలను అన్వేషిస్తోంది.

వర్క్ ఫ్రం హోంతో కంపెనీలు ఆఫీసు పనిగంటల కంటే ఎక్కువే చేయించుకుంటున్నాయి. అంతేకాకుండా 24 గంటలు ఏదో ఒక వర్క్ తో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయిన కొందరు వాపోతున్నారు. ఆఫీస్ పనిగంటలు పూర్తయ్యాక కూడా మెయిల్స్, మెసేజ్లు పెడుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్నారు. అంతేకాకుండా ఇంటినుంచి పనిచేసేవాళ్లకు ఇంటర్నెట్, విద్యుత్ ఖర్చులు అదనంగా భారం పడుతున్నాయి. దీంతో కొందరు వర్క్ ఫ్రం హోం కంటే ఆపీసుల్లో పనిచేస్తేనే బెటరని ఆ దిశగా వెళ్లారు.

ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోంపై నియంత్రించే విధంగా సమగ్ర ఫ్రేమ్ వర్క్ రూపొందించనుంది. కొవిడ్ 19 విస్తరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు నిపుణులు అందించిన నివేదిక ప్రకారం.. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ వర్కింగ్ వంటి ఉద్యోగులను పని ఒత్తిడిని నియంత్రించడమే కాకుండా కొవిడ్ వ్యాప్తి నివారించడమే దీని లక్ష్యం. ఉద్యోగుల పనిగంటలు నిర్ణయించి, విద్యుత్, ఇంర్నెట్ వంటి ఖర్చులను కంపెనీలు చెల్లించే విధంగా నిర్ణయిస్తారు.ఇక పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలుంది. పిల్లలకు 8 ఏళ్ల వయసు వచ్చేవరకు తల్లిదండ్రులు ఇంటినుంచే పనిచేసే వీలు కల్పించనున్నారు.

ఇప్పటికే పోర్చుగల్ దేశం వర్క్ ఫ్రం హోం విషయంలో కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆఫీసు పనివేళలు ముగిసిన తరువాత కూడా ఉద్యోగులకు బాస్లు, మెసేజ్లు, ఈమెయిల్ చేయడానికి పోర్చుగల్ నిషేధించింది. దీనిని ‘విశ్రాంతి తీసుకునే హక్కు’గా పరిగణిస్తున్నారు. పోర్చుగల్ లో వర్క్ ఫ్రం హోంను విస్తరించిన నేపథ్యంలో వర్క్ -లైఫ్ బ్యాలెన్స్ కోసం తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకుంది. నిర్ణీత పనిగంటల అనంతరం ఉద్యోగులకు ఎలాంటి మెసేజ్లు, మెయిల్స్ పంపరాదు. 10 మంది ఉద్యోగులు ఉన్న అన్ని కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

అయితే త్వరలో మనదేశంలోనూ ఇలంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఇంట్లో ఉండి వర్క్ చేయడం వల్ల మానసిక సమస్యలకు గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడితో పనిచేసి అనారోగ్యానికి గురవుతున్నారు. కాగా కొందరు తమ భర్తలు వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఓ మహిళ వర్క్ ఫ్రం హోంను రద్దు చేయాలని ఏకంగా కంపెనీకే లేఖ రాసింది. అయితే కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తున్నారని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం నియంత్రణనై సమగ్ర చట్టం రూపొందించే అవకాశాలున్నాయని అంటున్నారు.