Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: కోవిడ్ 19 వాక్సిన్ ట్రయల్ సక్సెస్

By:  Tupaki Desk   |   3 April 2020 9:50 AM GMT
గుడ్ న్యూస్: కోవిడ్ 19 వాక్సిన్ ట్రయల్ సక్సెస్
X
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచంపై పడి ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. అభంశుభం తెలియని పసివాళ్లను - పండు ముసలివాళ్లను కబలిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో జనం పిట్టల్లా రాలుతున్నారు.గంట గంటకూ ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతూ.., ప్రాణాలు పోతూనే ఉన్నాయి.. ఈ వైరస్ అంతం ఎప్పుడో తెలియని పరిస్థితి లేకపోవడంతో దేశాలకు దేశాలు లాక్ డౌన్ విధించాయి. అంతటా భయాందోళన నెలకొంది. అయితే తాజాగా ఈ కోవిడ్ 19 వైరస్ గురించి ఒక శుభవార్త అందింది.

కరోనాను జయించిన రోగుల శరీరాలలోని యాంటీ బాడీలపై పరిశోధించిన శాస్త్రవేత్తలు మొదటి యాంటీ బాడీ పరీక్షను విజయవంతం చేశారు. దీనికి తాజాగా అమెరికా ‘ఎఫ్.డీ.ఏ’ ఆమోదించింది. రోగి రక్తం నుంచి ఈ యాంటీ బాడీని ‘సెల్లెక్స్’ అనే బయో టెక్నాలజీ కంపెనీ కనుగొంది. రోగి యొక్క సిరల నుంచి రక్త నమూనాను తీసుకొని వీరు ప్రయోగం చేశారు.

అమెరికాలోని పీట్స్ బర్గ్ ప్రయోగశాలలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేయడంలో పురోగతి సాధించినట్లు తెలిసింది. రాబోయే మూడు నెలల్లోనే మనుషులపై ట్రయల్స్ చేయాలని యోచిస్తున్నారు.

ఈ ట్రయల్స్ పూర్తి చేసి వచ్చే ఆరు నెలలలోపే ఈ వ్యాక్సిన్ ను ఆమోదించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అమెరికా సర్కారు భావిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే కరోనాపై మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టే.అది నెరవేరాలని కోరుకుందాం.