Begin typing your search above and press return to search.

బంధువులు అంటూ పెళ్లికి వెళ్లడం .. ఆపై విలువైన వస్తువులు స్వాహా !

By:  Tupaki Desk   |   5 March 2021 1:30 PM GMT
బంధువులు అంటూ పెళ్లికి వెళ్లడం .. ఆపై విలువైన వస్తువులు స్వాహా !
X
బంధువులం అంటూ చెప్పి , వారిని నమ్మించి వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసులు గురువారం రిమాండ్ ‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్ ‌దేవ్ ‌పల్లి ఇన్‌ స్పెక్టర్‌ వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌ రాజ్‌ ఘడ్‌ జిల్లాకు చెందిన ప్రశాంత్ , శ్రావణ్‌ తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్ ‌దేవ్ ‌పల్లి, రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువులం అంటూ వచ్చారు.

ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి ఉడాయించేవారు. మైలార్‌ దేవ్‌ పల్లి తో పాటు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలో గతనెల మూడవ వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌ లో వేసి స్టేజిపైనే ఉంచారు.

ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని అక్కడి నుండి తీసుకొచ్చింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్‌ తీసుకువెళ్లిన సంఘటన రికార్డ్ అయింది. కుటుంబ సభ్యులు మైలార్ ‌దేవ్ ‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్‌ ఎస్‌ ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్ ‌హాల్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.