Begin typing your search above and press return to search.

కరోనా టెస్టుల్లో గోల్ మాల్ .. కుంభమేళాలో లక్ష నకిలీ రిపోర్టులు

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:31 AM GMT
కరోనా టెస్టుల్లో గోల్ మాల్ .. కుంభమేళాలో లక్ష నకిలీ రిపోర్టులు
X
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో హరిద్వార్‌ లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు అప్పట్లోకొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి.అయితే కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. కరోనా టెస్టుల్లో గోల్‌ మాల్ జరిగినట్లు తాజాగా రిపోర్టులు చెబుతున్నాయి.హరిద్వారాలో కుంభమేళా జరుగుతున్న సమయంలో సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో దాదాపుగా లక్ష వరకు కరోనా ఫేక్‌ రిపోర్ట్‌ లను ఇచ్చారని ఉత్తరాఖండ్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ పని మొత్తం ప్రైవేట్ ల్యాబ్ ల పనేనని, కుంభమేళా సమయంలో రోజూ 50 వేల కోవిడ్ టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడంతో ఆ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రైవేట్ ల్యాబ్ లు, టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని తాజాగా గుర్తించారు. ఒకనొక సందర్భంలో ఒకే ఫోన్‌ నంబర్‌ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్నవారి సమాచారం పూర్తిగా ఫేక్‌ అని కూడా తేలింది. హరిద్వార్‌ లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు ఐదు వందల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు.

కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఏజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఫేక్‌ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సింగ్‌ సెనగర్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుంది. టెస్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామన్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను అందిస్తామని హెల్త్‌ సెక్రటరీ అమిత్‌ నేగి పేర్కొన్నారు.