Begin typing your search above and press return to search.

మాంద్యం మహమ్మారి: జర్మనీని కప్పేసింది.. భారత్ ను ఆవహిస్తుందా?

By:  Tupaki Desk   |   29 Sep 2022 2:30 AM GMT
మాంద్యం మహమ్మారి: జర్మనీని కప్పేసింది.. భారత్ ను ఆవహిస్తుందా?
X
కరోనాతో వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అందరి ఉద్యోగ, ఉపాధి పోయింది. దీంతోపాటు ప్రభుత్వాలకు ఆదాయాలు పడిపోయాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉత్పత్తి నిలిచిపోయి గణనీయంగా ఆర్థిక వృద్ధి పడిపోయింది. దీంతో ప్రపంచానికి మరో మాంద్యం ముప్పు తప్పదా? అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరిస్థితులు చేజారిపోతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టీ.ఓ) కూడా ఇదే హెచ్చరికలు జారీ చేసింది.

జెనీవాలో జరిగిన డబ్ల్యూ.టీ.ఓ సదస్సులో ప్రస్తుతం మాంద్యం వైపు ప్రపంచం పయనిస్తోందని డబ్ల్యూ.టీ.ఓ డైరెక్టర్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డబ్ల్యూ.టీవో చీఫ్ తెలిపారు. వడ్డీ రేట్ల పెంపు తప్ప సెంట్రల్ బ్యాంకులకు ఇతర మార్గాలు లేవని వ్యాఖ్యానించారు. ఆహార భద్రత ప్రపంచానికి పెద్ద సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యానికి దగ్గర అవుతున్నాయని.. ఇంధన కొరత, వాతావరణ మార్పులు, విపరీతంగా పెరిగిన ఆహార ధరలు సంక్షోభాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచదేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సైతం అనేక కారణాల వల్ల మందగించాయి. ప్రపంచదేశాలపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. యుద్ధం కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు తిరిగి సాధారణ స్థితికి రాకుంటే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం యూరప్ దేశాలను మాంద్యం మబ్బులు కమ్మేశాయి. రష్యా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. వీటి ధరల కారణంగా వ్యాపారులు ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. రష్యా నుంచి చవకైన గ్యాస్ పైప్ లైన్ నిలిచిపోవడంతో అమెరికా నుంచి లిక్విఫైడ్ గ్యాస్ ను జర్మనీ దిగుమతి చేసుకుంటోంది. దీంతో జర్మనీలో తయారీతోపాటు విద్యుత్ ఉత్పత్తి సైతం తీవ్రంగా దెబ్బతింది. జర్మనీతోపాటు బ్రిటన్ కూడా మాంద్యం ముప్పులోకి జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా, యూరప్ దేశాలు మాంద్యం వైపు పయనిస్తున్నాయి. భారత్ దాని ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ సంస్థలు అంచనావేస్తున్నాయి. భారత్ ఎక్కువగా ఇంధన దిగుమతిదారులు అయినప్పటికీ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అంతగా దిగజారలేదని.. పటిష్టంగానే ఉందని అంటున్నారు. విదేశీ మారకద్రవ్యంతోపాటు కంపెనీల పనితీరు భారత్ ను నిలబడెతున్నాయి. సో భారత్ కు ఇప్పటికిప్పుడు మాంద్యం ముప్పు లేదని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.