Begin typing your search above and press return to search.

ఫుల్ అలెర్ట్ : జగన్ తప్పు చేయనంటున్న బాబు...?

By:  Tupaki Desk   |   14 May 2022 7:28 AM GMT
ఫుల్ అలెర్ట్ : జగన్ తప్పు చేయనంటున్న బాబు...?
X
తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు. అలా చేసిన వారు వాటిని దిద్దుకుంటే గుణ‌పాఠం నేర్చుకున్నట్లు. పక్క వారు అలెర్ట్ అయితే పాఠం నేర్చుకున్నట్లు. ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న చంద్రబాబు చాలా విషయాల్లో అప్ టూ డేట్ అవుతున్నారు. ఆయన వయసు సీనియారిటీని పక్కన పెట్టి మరీ న్యూ జనరేషన్ తో అడుగులు వేస్తున్నారు. కాలం తో పాటే తన ఆలోచనలను కూడా మార్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో 2014 నాటి బాబును తాను కానీ కాను అంటున్నారు.

అది పార్టీ విషయాలోనే కాదు, ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా బాబు పక్కా క్లారిటీతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. అందుకే గత కొంతకాలంగా జనాల్లో తిరుగుతున్న చంద్రబాబు జగన్ సంక్షేమ పధకాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. జగన్ సర్కార్ 32 సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇందులో అమ్మ ఒడి తో పాటు కంప్లీట్ ఫీజ్ రీ ఇంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, టైలర్లకు, ఆటో డ్రైవ‌ర్లకు, ఇతర వర్గాలకు నగదు సాయం వంటివి ఉన్నాయి.

ఈ స్కీమ్స్ విషయంలో తన విధానం ఏంటో ఈ రోజుకీ టీడీపీ ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఈ స్కీమ్స్ వల్ల అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా చాలా మంది పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పోరేట్ కాలేజీలలో చదువుకుంటున్నారు. అదే విధంగా చిన్న వృత్తుల వారికి నగదు ఆసరా లభిస్తోంది. వారికి అయ్యే ఖర్చు వేరే విధంగా ఉన్నా ఉచితంగా ఇస్తున్న ఈ డబ్బుని ఎవరూ కాదనుకోరు.

మరి ఈ పధకాల గురించి పల్లెత్తు మాట అనని చంద్రబాబు ఏపీ అప్పుల పాలు అవుతోందని మాత్రమే ఎక్కడ చూసినా మాట్లాడుతూంటారు, ఏపీని అప్పుల్లో ముంచేసారు అని జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తూంటారు. ఏపీలో అభివృద్ధి ఎక్కడా లేదని అంటారు. ఇవన్నీ సమంజసమైన ఆరోపణలే కానీ సంక్షేమం కోసమే తాము అప్పులు తెస్తున్నామని వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్నారు. ఈ సంక్షేమ ఆపేయాలా అని ఏకంగా మంత్రుల స్థాయి నుంచి జగన్ దాకా చంద్రబాబుని గట్టిగా నిలదీస్తున్నారు.

అయినా సరే దానికి టీడీపీ నుంచి జవాబు లేదు. అయితే ఇది వ్యూహాత్మకంగానే జరుగుతోంది అంటున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారింది, ఏపీ బ్రాండ్ పాడైంది. ఏపీ కోలుకోలేని దెబ్బ తింది అని చంద్రబాబు తరచూ సభలలో చెబుతున్నారు. అయితే బాబు ఇలా మాట్లాడడం వెనక ప్రజలలో అభివృద్ధి మీద ఆసక్తిని పెంచాలన్న ఒక లక్ష్యం కనిపిస్తోంది. అదే సమయంలో పధకాలు అందుకుంటున్న వారిలోనూ ఆలోచన పెంచాలన్న ఉద్దేశ్యం వ్యక్తం అవుతోంది.

ఈ కారణంతోనే జగన్ సర్కార్ అమలు చేస్తున్న పధకాల జోలికి ఆయన అసలు పోవడంలేదు అని అంటున్నారు. నిజానికి జగన్ 2014లో రైతులకు రుణ మాఫీ చేయడం కష్టం, ఏపీ ఆర్ధికంగా బాగులేదు అని భావించి హామీ ఇవ్వలేదు. అదే జగన్ 2019 నాటికి అనేక రకాలైన సంక్షేమ పధకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. చివరికి వాటిని అమలు చేయడం కోసం నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే చంద్రబాబు కూడా 2014లో అనేక వరాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా వచ్చాక వాటిని నిలబెట్టుకోవడం కష్టమైంది. ఇక జగన్ అన్నింటికి మించి అన్న తీరున సంక్షేమాన్నిఏపీలో అమలు చేస్తున్నారు. తాను కూడా వాటిని అమలు చేయాలంటే ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు అవుతుంది. అపుడు జగన్ మాదిరిగానే అప్పులు చేస్తూ పోవాలి. అందుకే తెలివిగా చంద్రబాబు పధకాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు అంటున్నారు. తాను నమ్ముకున్న అభివృద్దే తనను గెలిపిస్తుంది అని ఆయన విశ్వాసంతో ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే కొన్ని సెలెక్టెడ్ పధకాలు మాత్రమే కొనసాగిస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడపాలన్నది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణంగానే బాబు ఏపీని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటాను అని ప్రతీ సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి బాబు సంక్షేమ పధకాల విషయంలో పెదవి విప్పకపోతే వైసీపీ ఊరుకుంటుందా. ఇక జనాలు కూడా ఎన్నికలు దగ్గరపడ్డ వేళ టీడీపీ వరాల కోసం వేచి చూడకుండా ఉంటుందా. వాటిని ఎలా అధిగమించి చంద్రబాబు ఏలా అధికారంలోకి వస్తారో చూడాలి.