Begin typing your search above and press return to search.

కప్పలకు విడాకులు.. ఇంట్రెస్టింగ్ కథ

By:  Tupaki Desk   |   13 Sep 2019 1:30 AM GMT
కప్పలకు విడాకులు.. ఇంట్రెస్టింగ్ కథ
X
జనాలకు ఏదీ ఎక్కువైనా కష్టమే.. ఇట్టే రియాక్ట్ అయిపోతారు. మొన్నటికి మొన్న జూన్, జూలై నెలల్లో వర్షాలు లేక చెన్నై, భోపాల్ నగరాల్లో నీటి యుద్ధాలు జరిగాయి. జనాలంతా వర్షాలు కురిపించాలని కప్పలకు పెళ్లిల్లు చేస్తూ దేవుళ్లకు వెయ్యినొక్క మొక్కులు మొక్కారు.. సరే పోనీలా అని జనాల కష్టాలు చూడలేక ఇప్పుడు వరుణ దేవుడు వానలు కురిపిస్తుంటే వాటిని తట్టుకోలేక వానలు వద్దు బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఈ జనాలకు ఏది ఎక్కువైనా కష్టంలాగానే కనిపిస్తోంది.

వానల ధాటికి మధ్యప్రదేశ్ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. నెలకిందటి వరకు నీరు లేక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ విలవిలలాడింది. జనాలు హాహాకారాలు చేశారు. వానలు కురవాలని సంప్రదాయ బద్దంగా కప్పలకు వివాహం జరిపించేశారు. దీంతో సెప్టెంబర్ 11వ తేదీ నాటికి గడిచిన నెలంతా మధ్యప్రదేశ్ ను వానలు ముంచెత్తాయి. అక్కడ సాధారణం కంటే 26శాతం అధిక వర్షపాతం నమోదైంది. 13 ఏళ్లలోనే అత్యధిక వాన గడిచిన 24 గంటల్లో భోపాల్ లో పడింది. ఈ వానలకు కలియసోట్, భద్భదా , కోలార్ లాంటి ఎన్నడూ నిండని ప్రాజెక్టులు నిండిపోయి గేట్లు ఎత్తినీటిని కిందకు వదులుతున్నారు. భోపాల్ మొత్తం వరదనీటితో నిండి పోయి జనాలు వానలు వద్దు మొర్రో అంటూ వేడుకుంటున్నారు. అయినా వానలు ఆగడం లేదట..

దీంతో ఈ వానలు ఆపాలని భోపాల్ ప్రజలు దేవుడికి వింతైన పూజ ఒకటి జరిపించారు. అది ఇప్పుడు వైరల్ అయ్యింది. అందరూ దాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భోపాల్ శివసేన మండలి సభ్యులు తాజాగా భోపాల్ లో భారీవర్షాలు పడకుండా జూలైలో పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించారు. ఈ విడాకుల వేడుకను వేదపండితులు, మేళతాళాలు, మంత్రాల జపాల మధ్య చేశారు. కప్పల విడాకుల వేడుకతోనైనా వర్షాలు ఆపాలని వరుణ దేవుడిని కోరుకున్నారు.

ఇలా వానలు పడాలని కప్పలను కలిపిన భోపాల్ వాసులు.. ఇప్పుడు పడొద్దని అదే కప్పలకు విడాకులు ఇచ్చేశారు. దేవుడి కరుణించినా వద్దంటున్న భోపాల్ వాసుల కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరి కప్పల విడాకులతోనైనా వానలు ఆగుతాయా.? లేదా అనేది వేచిచూడాలి.