Begin typing your search above and press return to search.

కరోనా@ నాలుగేళ్లు.. నాటి కల్లోలం మర్చిపోగలమా..!

By:  Tupaki Desk   |   2 Dec 2022 5:30 PM GMT
కరోనా@ నాలుగేళ్లు.. నాటి కల్లోలం మర్చిపోగలమా..!
X
కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయమై మూడేళ్లు గడిచిపోయాయి. కరోనా తొలి కేసు 2019 డిసెంబర్లో వెలుగు చూడగా తొలి మరణం జనవరి 1, 2020 న నమోదైంది. ఈ క్రమంలోనే తొలి కేసు వెలుగు చూసి 2022 డిసెంబర్ 2 నాటికి నాలుగేళ్ల కాలాన్ని కరోనా పూర్తి చేసుకుంది. 2020 జనవరి 1న మొదలైన కరోనా మరణాలు 2022 మార్చి నాటికి 60 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని గణంకాలు వెల్లడిస్తున్నాయి.  

చైనాలోని వుహాన్ నగరంలో న్యూమోనియా కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో వైద్యులంతా ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. 2020 ఆరంభానికి గానీ కరోనా మహమ్మారిని గుర్తించలేదు. దీంతో వైరస్ అప్పటికే చైనా నగరాన్ని చుట్టుముట్టింది. దీంతో చైనాలో మొదట లాక్డౌన్ విధించారు. అయితే అప్పటికే కరోనా చైనా నుంచి మిగతా దేశాలకు పాకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి.

చైనా సరిహద్దు దేశాలతో సహా అన్ని దేశాలు కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ పాటించాయి. దీంతో రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా మాత్రం కట్టడి కాకపోవడంతో  కరోనా పేరు చెబితేనే ప్రజలు జంకే పరిస్థితి వచ్చింది.

అప్పటి కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా రోగులంతా హోం ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. వైద్యులు కోవిడ్ జాకెట్లను.. మాస్కులు వంటివి ధరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఎంతో మంది వైద్యులు ప్రాణాలను సైతం కోల్పోవడం విషాదంగా మారింది. అదేవిధంగా ప్రజలంతా కరోనా మాస్కులు.. భౌతిక దూరం.. శానిటైజర్ వంటి జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నివారణలో తమవంతు బాధ్యతను నిర్వర్తించారు.

అయితే కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరంగా మారింది. అయితే స్వచ్చంధ సంస్థలు.. సామాజిక సంస్థలకు చెందిన వ్యక్తుల మానవత్వం ప్రదర్శించి కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే కరోనా కాలంలో ఎంతో మంది ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మరికొందరు వైద్య పరికరాలు.. ఆక్సిజన్ సిలిండర్లు.. నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చితికిపోవడంతో లెక్కలెనన్నీ కుటుంబాలు కకావికలమయ్యాయి. ఎంతోమంది ఆప్తులను కోల్పోయి చివరి చూపుకు నోచుకోలేదు. మహిళలు.. పిల్లలు ఇంటికే పరిమితం కావడంతో వారి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పించింది. రెండేళ్ల పాటు విద్యా వ్యవస్థ గాడి తప్పింది. దీంతో విద్యార్థులు.. చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లాక్డౌన్ల కారణంగా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

రవాణా వ్యవస్థ స్తంభించడంతో వలస కార్మికులు కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో అనేక మంది వలస జీవులు తమ ప్రాణాలను సైతం కోల్పోవడం విషాదాన్ని నింపింది. కంపెనీలు.. పరిశ్రమలు మూతపడడంతో కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కరోనా సమయలో సామన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడగా అంబానీ.. అదానీల ఆస్తుల మాత్రం మరింత వృద్ధి చెందడం కన్పించింది.

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తున్నాయి. అయితే కరోనా వెలుగు చూసి మూడేళ్లు గడిచినా చైనాలో మాత్రం మళ్లీ కేసులు వెలుగు చూస్తుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతం చైనాలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అనుసరిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే చైనాలో కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.