Begin typing your search above and press return to search.

అప్పుడు చంద్ర‌బాబుపై ఫైర్ - ఇప్పుడు జ‌గ‌న్ పై ఫైర్!

By:  Tupaki Desk   |   22 Feb 2020 11:30 AM GMT
అప్పుడు చంద్ర‌బాబుపై ఫైర్ - ఇప్పుడు జ‌గ‌న్ పై ఫైర్!
X
వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు.. ఒక‌ప్ప‌టి మంత్రి. చంద్ర‌బాబు నాయుడి కేబినెట్లో ఆయ‌న మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. 2004లో ఏపీలో తెలుగుదేశం పార్టీ చిత్తు కావ‌డంతో వ‌డ్డే శోభ‌నాద్రి కూడా రాజ‌కీయంగా రేసులో వెనుక‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గానే ఉండినా - ఆ త‌ర్వాత మాత్రం కామ్ అయ్యారు. అయితే 2014 త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న వివిధ ప్ర‌క‌ట‌న‌ల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చారు. ప్ర‌త్యేకించి అమ‌రావ‌తి-రాజ‌ధానికి భూ సేక‌ర‌ణ అంశంలో వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు స్పందించారు. అది చంద్ర‌బాబు విధానాల‌కు వ్య‌తిరేకంగా!

రాజ‌ధానికి అంటూ చంద్ర‌బాబు నాయుడు భారీగా చేప‌ట్టిన ల్యాండ్ పూలింగ్ ను వ‌డ్డే గ‌ట్టిగా వ్య‌తిరేకించారు. భూములు ఇచ్చేది లేద‌న్న రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు ఆయ‌న‌. భూములు తాము ప్ర‌భుత్వానికి ఇవ్వ‌మ‌ని కోర్టుకు ఎక్కిన రైతుల త‌ర‌ఫున మాట్లాడారు. అలాగే రాజ‌ధానికి మూడు పంట‌లు పండే వ్య‌వ‌సాయ భూముల అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అంశాల గురించి స్పందించ‌గా - వాటి మీద వ‌డ్డే మాట్లాడారు. ఆయ‌న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ కాదు. దీంతో వ‌డ్డే వాయిస్ వైసీపీకి అద‌నంగా తోడ‌య్యింది. అయితే వ‌డ్డే వ్య‌తిరేకించినా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకించినా... రాజ‌ధాని ల్యాండ్ పూలింగ్ అయితే జ‌ర‌గింది. ఆ ప‌రిణామాల్లో చంద్ర‌బాబుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు శోభ‌నాద్రి. చంద్ర‌బాబు నాయ‌డి కేబినెట్లో ఒక‌ప్పుడు మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న అలా టీడీపీ అధినేత‌ను విమ‌ర్శించ‌డం ప్ర‌ముఖంగా నిలిచింది.

ఆ సంగ‌త‌లా ఉంటే... ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తున్నారు వ‌డ్డే. జ‌గ‌న్ కు రైతుల మీద - పేద‌ల మీద ప్రేమ లేద‌ని వ‌డ్డే అంటున్నారు. నేతి బీర‌కాయ‌లో నెయ్యి ఎంతో - జ‌గ‌న్ వ‌ద్ద ఉండే ప్రేమ కూడా అంతేనంటూ ఆయ‌న సామెత‌లు చెబుతున్నారు. మూడు పంట‌లు పండే చోట రాజ‌ధాని వ‌ద్దంటూ అప్పుడు చంద్ర‌బాబును విమ‌ర్శించిన వ‌డ్డే - రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ అంటున్న జ‌గ‌న్ ను కూడా అలాగే విమ‌ర్శిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ కు స‌ల‌హాదారులు స‌రిగా లేర‌ని వ‌డ్డే అంటున్నారు! ఇంత‌కీ ఏం చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టో!