Begin typing your search above and press return to search.

'ఏయ్‌ ఎస్‌ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది' మాజీ మంత్రి అవంతి ఫైర్‌

By:  Tupaki Desk   |   17 May 2022 6:59 AM GMT
ఏయ్‌ ఎస్‌ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది మాజీ మంత్రి అవంతి ఫైర్‌
X
వైసీపీ నాయ‌కులు స‌హ‌నం కోల్పోతున్నారు. త‌మ‌ను ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షాల‌పైనే అనుకుంటే.. పొర‌పాటు.. ఇప్పుడు ఏకంగా.. ప్ర‌జ‌ల‌ను కూడా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌ల‌ను గెంటేయాలంటూ .. రంకెలు వేస్తున్నారు. ఇలా చేయ‌ని పోలీసుల‌పైనా విరుచుకుప‌డుతున్నారు. తాజాగా .. తనకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకునేందుకు వేదిక వద్దకు వచ్చిన ఓ రైతును పోలీసులు నిలువరించలేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స‌ద‌రు బాధితుడిని బ‌య‌ట‌కు గెంటేయ‌కుండా.. సినిమా చూస్తున్నావా? అంటూ.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. 'ఏయ్‌ ఎస్‌ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది' అంటూ మండిపడ్డారు. రైతు భరోసా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో వ్యవసాయశాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. ఆ వేదికపై స్థానిక నాయకులు మాట్లాడుతుండగా... అదే పంచాయతీ పరిధిలోని గెద్దపేటకు చెందిన సూర్యనారాయణ అనే రైతు... తన 98 సెంట్ల జిరాయితీ భూమిని జగనన్న కాలనీకి అన్యాయంగా తీసుకున్నారనే విషయం చెప్పేందుకు వేదిక వద్దకు వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వంపై స‌ద‌రు బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. స‌భ‌లోనే ఉన్న అవంతి.. పోలీసుల సాయంతో ఆయనను బ‌ల‌వంతంగా బయటకు పంపించి వేశారు. ఆ రైతును ఎందుకు నిలువరించలేదంటూ స్థానిక ఎస్‌ఐపై మండిపడ్డారు. ఈ సందర్భంలో ఓ మీడియా ప్రతినిధిపై 'నీ సంగతి చూస్తానంటూ' బెదిరింపులకు దిగారు. 'అన్నీ ఇస్తుంటే ఇలాగే ఉంటుంది. మీ వద్దకు వస్తున్నామని చులకనగా చూడొద్దు. వాస్తవాలను తెలుసుకోవాలి' అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

అవంతికి నిల‌దీత‌లు..

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలెం పంచాయతీలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స‌గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమాన్ని 2వ రోజు కొనసాగించారు. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీలో కొన్ని గడపలకు వెళ్లారు. ఎక్కడ చూసినా మురుగు నీరు రోడ్లమీదే ప్రత్యక్షమైంది. కాలువలు సక్రమంగా లేవనే విషయాన్ని మహిళలు లేవనెత్తినప్పటికీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి మాత్రమే ప్రస్తావించి "మమ" అనిపించారు. దీంతో.. కొంతమంది మహిళలు ఎమ్మెల్యే అవంతిని గట్టిగా నిలదీశారు.

అంతా మీరే మాట్లాడుకుంటే మా దగ్గరకు ఎందుకు వచ్చినట్లని మ‌హిళ‌లు ప్రశ్నించారు. తాము ఓట్లు వేసి గెలిపించామని.. తమ సమస్యలు ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. తాగునీటి పథకం పనిచేయడం లేదని, ఫ్లోరైడ్ వ్యాధితో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరమూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామంలో మురుగునీరు అంతా తమ ఇంటి ముంగిటే ఉంటోందని.. కాలువ వేయడానికి కూడా పంచాయతీలో నిధులు లేవని అధికారులు అంటున్నారని పలువురు మండిపడ్డారు. ఊహించని ఈ సంఘటనతో ఎమ్మెల్యే అవంతి అవాక్కయ్యారు.

అవినీతిని బ‌య‌ట‌పెట్టిన మ‌హిళ‌...

ఓ మహిళ తనకు ఇంటిస్థలం లేదంటూ మాజీ మంత్రి అవంతికి విన్నవించారు. కరెంట్ బిల్లు ఉండడంతో ఇల్లు రాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సదరు మహిళ కలుగజేసుకోని.. చాలామందికి ఇల్లు ఉన్నా.. మరలా ఇల్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వారంతా లక్షలాది రూపాయలకు ఇళ్లు అమ్ముకుంటున్నారని బాధితురాలు ఆక్రోశించింది. పంచాయతీ పెద్దలు, అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని, చేతులు త‌డిపితేనే ప‌నులు అవుతున్నాయ‌ని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.