Begin typing your search above and press return to search.

నివర్ తుఫాన్ ఎఫెక్ట్..సీఎం ఇంట్లోకి వరద నీళ్లు!

By:  Tupaki Desk   |   26 Nov 2020 11:30 AM GMT
నివర్ తుఫాన్ ఎఫెక్ట్..సీఎం ఇంట్లోకి వరద నీళ్లు!
X
నివర్ తుపార్ తాజాగా మరింత బలపడి అతి తీవ్ర తుపాన్ ‌గా మారింది. తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే , ఏపీలోని పలు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నివర్ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుపాన్ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరోవైపు నివర్ ప్రభావం వల్ల గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నివర్‌ ప్రభావంతో తమిళనాడు తీరంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో 6వ నంబర్‌ వరకు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలను కోరింది.చెన్నైలోని ప్రధాన రహదారులపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో అన్ని ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేశారు. తుపాన్ ప్రభావంతో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఐదేళ్ల తర్వాత చెంబరంబాక్కం జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. మరోవైపు, పుదుచ్చేరిలో గత 24 గంటల్లో అత్యధికంగా 24 సెం.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి నివాసంలోకి వరదనీరు వచ్చి చేరింది. వర్షం నీరును బయటకు పంపేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో మూడు గంటల పాటు తుఫాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.