Begin typing your search above and press return to search.

పట్టువదలని హరీష్ రావు.. ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:30 AM GMT
పట్టువదలని హరీష్ రావు.. ఏం చేస్తారు?
X
ప్రకృతితో పరిహాసమాడితే ఏమొస్తది.. మనకే నష్టమొస్తది. ప్రకృతిని ప్రేమించి కాపాడితే మనకూ మనుగడ సాధ్యమైతది. రాజకీయాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించే టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిష్ రావు మరో బృహత్కర కార్యాన్ని చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నారు.

హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ఇప్పుడు ప్రతీ విషయంలో కొత్తగా ఆవిష్కరిస్తూ తెలంగాణకే మార్గ నిర్ధేశం చేస్తోంది. చురుకైన హరీష్ రావు బాటలో ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హరీష్ రావు ఒక పిలుపునిచ్చాడు. ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలకు గ్రామం మొత్తానికి ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. అదీ మట్టివినాయకుడినే పెట్టాలని కోరారు. దీని పేరు ‘ఏక వినాయక మహోత్సవం’గా నామకరణం చేశారు.

వినాయకుడి పండుగ వస్తే చాలు పల్లెలు, పట్నాల్లో గల్లీకి ఒకటి చొప్పున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వందల సంఖ్యల వినాయకులు కొలువుదీరుతాయి. కులాలు, సంఘాలు, కాలనీల వారీగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రమాదకర రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల నిమజ్జనం తర్వాత చెరువులు కలుషితమై చేపలు చనిపోయి.. ఆ సాగునీటితో పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతోంది. పైగా వినాయక ఉత్సవాల మైక్ లతో ఊరు వాడ శబ్ధ కాలుష్యం.. ఇక కొన్నిచోట్ల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు.. ఇలా అన్నింటిని బేరీజు వేసుకొని హరీష్ రావు ఇలా ఊరుకొక్కటి వినాయక విగ్రహం.. అదీ మట్టివినాయకుడే పెట్టాలని పిలుపునిచ్చారు.

కాగా హరీష్ పిలుపునకు మంచి స్పందన వచ్చింది. తొట్టతొలిగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకటే వినాయకుడి మట్టి విగ్రహం ఊరంతటికి పెట్టాలని తీర్మానించింది. అన్ని గ్రామాలు ఇదే బాటలో నడుస్తున్నాయట.. సో హరీష్ రావు లక్ష్యం నెరవేరే సూచనలే కనిపిస్తున్నాయి..ఇది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగితే మాత్రం ప్రకృతిని మనమంతా కాపాడినవారమవుతాం..