Begin typing your search above and press return to search.

ఐటీ రంగానికి కరోనా దెబ్బ..30 వేల మంది ఔట్

By:  Tupaki Desk   |   11 July 2020 6:17 PM GMT
ఐటీ రంగానికి కరోనా దెబ్బ..30 వేల మంది ఔట్
X
ప్రపంచ దేశాలను మహమ్మారి వైరస్ అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలు అనామక రాజ్యం వరకు కరోనా మహమ్మారి విసిరిన పంజాకు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. కరోనా దెబ్బకు అన్ని రంగాలు దాదాపుగా కుదేలవగా....అవన్నీ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు ఆర్థిక నిపుణులు. 2008 ఆర్థిక మాంద్యంతో పోలిస్తే కరోనా దెబ్బకు పాక్షికంగా వచ్చిన పూర్తిస్థాయిలో రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, అంతంత మాత్రం ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం వల్ల ఐటీరంగం తీవ్రంగా దెబ్బతింటుందని చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కేవలం మనదేశంలోని ఐటీ రంగంలోనే 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా కాటుకు ఐటీ రంగంలో దాదాపు 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని, వారికి అదనంగా మరో 50 వేల మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని అంచనా వేస్తున్నారు. త్వరలోనే మరి కొంతమంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

చిన్న,మధ్య స్థాయి, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్ లోని ఐటీ, బీపీఓ కంపెనీల్లో 43.6 లక్షల మంది పనిచేస్తున్నారని, అందులో 0.70 శాతం ఉద్యోగాలకు కోత పడిందని చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులు రావట్లేదని, ఆదాయం తగ్గి మార్జిన్లపై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. కంపెనీపై భారం పడడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధపడుతున్నాయని చెబుతున్నారు. జులై- సెప్టెంబరు క్వార్టర్ లో ఈ ఉద్వాసనలు ఊపందుకోవచ్చని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ కీలక ఉద్యోగి వెల్లడించారు. కొన్ని కంపెనీలు... బెంచ్ పై ఉన్న ఉద్యోగులు, పనితీరు బాగా లేని ఉద్యోగులను సెలవుపై ఇంటికి పంపుతున్నాయట. ఐటీ ఉద్యోగుల వేతనాల్లోనూ కోతలు పెడుతున్నాయట. రాబోయే కాలంలో ఐటీ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.