Begin typing your search above and press return to search.

2సార్లు ఇంటర్లో ఫెయిల్ ..ఈ రోజు 72వేలకు కోట్లకి అధినేత

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:30 PM GMT
2సార్లు ఇంటర్లో ఫెయిల్ ..ఈ రోజు 72వేలకు కోట్లకి అధినేత
X
జీవితం ఏ సమయంలో ఏ విధంగా ప్రారంభం అయ్యి , ఏ విధంగా ముగిసిపోతుందో తెలియదు. జీవితంలో కొన్ని సంతోషాలు , కొన్ని భాదలు ,గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా సర్వసాధారణం. జీవితంలో నేడు మనకి అతి పెద్దగా కనిపించే సమస్య కూడా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత చాలా చిన్నగా అనిపించవచ్చు. అందుకే జీవితంలో ఓడిపోయినప్పుడు, ఇక జీవితం అక్కడితో ముగిసిపోతుందేమో అని అక్కడే కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి. కష్టాన్ని , నిన్ను నమ్ముకొని అడుగులు ముందుకి వేస్తే విజయం మీ ఇంటి గేట్ ముందుకి నడుచుకుంటూ వస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్‌ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. ఈ రోజు 72వేలకు కోట్లకు అధిపతి. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి.

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులు. అందరూ కూడా కేవలం తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే తోనే జీవితాన్ని గడపాలి. అయితే ఇంట్లో అందరికీ సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు మాత్రం దూరం చేయలేదు. ఇంటర్‌ కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో మురళి ఇంటర్‌ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తండ్రికి తన చదువు భారం అని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు, కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని బాగా బాధపెట్టింది. అదే అయనకి కీలక మలుపు.

ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్‌ గా జీవితం ప్రారంభించి, అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ మాతృభూమి నుంచి వచ్చిన పిలుపుతో అయన భారత్ కి తిరిగివచ్చాడు. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే .. 1984లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రారంభం అయ్యింది. అందులో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్‌ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్‌ లాబొరేటరీస్‌ ని ప్రారంభించాడు.

దివీస్‌ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌ గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. ఇక, కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు. కరోనా వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు.

ఇక ఇంటర్‌ లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్‌ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి, కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి, అమెరికాలో ఉద్యోగం సాధించాను'' అని తెలిపాడు.