Begin typing your search above and press return to search.

ఈటలలో ఇరిటేషన్ మొదలైందిగా.. విమర్శలతో ఉతికేశాడు

By:  Tupaki Desk   |   21 July 2021 3:50 AM GMT
ఈటలలో ఇరిటేషన్ మొదలైందిగా.. విమర్శలతో ఉతికేశాడు
X
ఉన్న మంత్రి పదవిని పీకినా.. భూకబ్జా కేసులు నమోదైనా.. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అట్టే సీరియస్ కాకుండా.. మొహమాటంతో వీలైనంత మర్యాదగా.. పెద్ద మనిషిగా మాట్లాడిన మాజీ మంత్రి ఈటల ఇరిటేట్ అవుతున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా ఎదురవుతున్న సవాళ్లు.. ఉప ఎన్నికలో తనను ఓడించే విషయంలో కేసీఆర్ ప్రదర్శిస్తున్న పట్టుదల.. తనను దెబ్బ తీయటం కోసమే ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని తెర మీదకు తేవటమే కాదు.. ఈ పథకాన్ని తొలుత తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అమలు చేయాలని డిసైడ్ చేసిన తీరు ఆయనలో కోపాన్ని కట్టలు తెగేలా చేసిందని చెప్పాలి.

అందుకేనేమో.. గతంతో పోలిస్తే.. తాజాగా ఆయన మాటల్లో పదును పెరిగింది. తనపై విమర్శలు చేసే మంత్రుల్ని నేరుగానే టార్గెట్ చేస్తున్న ఈటల.. కేసీఆర్ హామీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఈ రోజు తను అయ్యానని.. రేపొద్దున మీరు కూడా టార్గెట్ అవుతారు సమా అంటూ ఈటల నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. ఉద్యమం వేళ.. కేసీఆర్ గొప్పగా చెప్పుకునే అంశాలపై ఈటల చేస్తున్న వ్యాఖ్యలు మంట పుట్టేలా చేస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి హరీశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘సిద్దిపేటల ఉన్న మంత్రి ఎగిరెగిరి పని చేస్తాండు. ఇవాళ నాకు జరిగినట్లు రేపు నీక్కూడా జరుగుతదని గుర్తుపెట్టుకో’’ అంటూ మంత్రి హరీశ్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ఉన్న నేతలకు తాజాగా ఆయనో వార్నింగ్ ఇచ్చారు. ‘ఎక్కడ కూడా నేను పద్ధతి తప్పలేదు, నేనొక్కడినే కాదు.. నాలాగ మంత్రులుగా ఉన్న వాళ్లు కూడా కొందరు పద్ధతి తప్పలేదు. ఇవాళ నాకు జరిగింది.. రేపు వాళ్లకు జరిగే ఆస్కారం ఉంటది తప్ప కేసీఆర్‌ ఎవ్వరినీ వదిలి పెట్టడనేది మర్చిపోవద్దు. సిద్దిపేటల ఉన్న మంత్రి ఎగిరెగిరి పని చేస్తాండు. ఇవాళ నాకు జరిగినట్లు రేపు నీక్కూడా జరుగుతదని గుర్తుపెట్టుకో’ అని హరీశ్ ను.. అదే సమయంలో తనపై ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్న మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపైనా విమర్శల్ని సంధించారు.

పింఛన్లిచ్చే మంత్రివి నువ్వే కదా.. నీ చేతుల్లో ఉన్నదా పింఛన్లిచ్చే దమ్ము, అధికారం ఉందా? అంటూ ఎర్రబెల్లిని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది ఒకరైతే.. తాజాగా మంత్రవర్గంలో పదవుల్ని అనుభవిస్తోంది మాత్రం వేరే వాళ్లంటూ నిప్పులు చెరిగారు. ‘‘అయినోన్ని వాకిట్ల పెట్టి కానోన్ని కంచంలో పెట్టుకున్నడు కేసీఆర్‌. ఎవడు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో.. ఎవరి మీద కేసులు ఉన్నయి, ఎవరు జైళ్లకు పోయిండ్లు, తిట్టినోడు ఎవ్వడో, కాపాడినోడు ఎవ్వడో తెల్వదా? కాపాడినోళ్లందరినీ బయటకు పంపించారని, తిట్టినోళ్లంతా ఇవాళ మంత్రులై వెలగబెడుతున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు.

ఇటీవల కాలలో కేసీఆర్ ఇస్తున్న హామీలపైనా ఈటల ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న మాటను నిలబెట్టుకున్నావా? అని సూటిగా ప్రశ్నించిన ఈటల.. మరిన్ని ప్రశ్నల్ని సంధించారు. ‘‘పింఛన్లు, రేషన్‌కార్డులు, మూడెకరాల భూమి, ఇళ్లు ఇవ్వకుండా దళిత బంధు పేరిట రూ.10 లక్షల చొప్పున ఇస్తామంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేసినవా? ఉన్న ఒక్క ఉప ముఖ్యమంత్రిని నెల రోజుల్లోనే పీకేసిన చరిత్ర కేసీఆర్‌ది. రాష్ట్రంలో 17 శాతం దళిత జనాభా ఉంటే కనీసం ఇద్దరు మంత్రులుండాలె, కానీ ఒక్కరే ఉంటడు, ఒకసారి మాల, ఇంకోసారి మాదిగ, ఇదీ దళితుల ను గౌరవించిన తీరు’ అని కడిగిపారేశారు.

టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేతలు ఎవరూ టచ్ చేయని పాయింట్ కూడా ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. ‘‘పోలీసోళ్లను కూడా చూస్తున్నా.. ఫొటోలు తీస్తాండ్లు, మేం నక్సలైట్లం అనుకుంటున్నారా ఏమన్నా. నౌకరీ చేయడం చేతకాకపోతే గులాబీ గులాబీ డ్రెస్‌ వేసుకుని కేసీఆర్‌ బానిసలం అని చెప్పుకోండి. ఇలాంటి ప్రయత్నాలు పోలీసు అధికారులు ఆపాలి’’ అని కోరారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈటల ఇంత తీవ్రంగా రియాక్టు అయి ఉంటారన్న మాట వినిపిస్తోంది.