Begin typing your search above and press return to search.

దిశ ఘ‌ట‌న‌పై మంత్రి ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఇదేం విశ్లేష‌ణ‌

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:02 PM GMT
దిశ ఘ‌ట‌న‌పై మంత్రి ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఇదేం విశ్లేష‌ణ‌
X
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోమారు సంచ‌ల‌న ప‌రిణామంతో వార్త‌ల్లో నిలిచారు. గ‌తంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో స‌ఖ్య‌త కార‌ణంగా ఆయ‌న అంద‌రి దృష్టిలో ప‌డితే...తాజాగా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఘ‌ట‌న‌పై స్పందించిన తీరుతో...తెర‌కెక్కారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ సైబర్ కన్వెన్షన్‌ లో జరుగుతున్న 6వ డెంటల్ కాన్ఫరెన్స్‌ కు మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఉన్నవారంతా వృతిమీదనే దృష్టి పెట్టకుండా కొంతైనా లోక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు కన్నీరు పెడుతున్నారని - వారి కన్నీరు సమాజానికి మంచిది కాదని చెప్పారు. ఈ స‌మ‌యంలోనే - దిశ నిందితుల ఎన్‌ కౌంటర్ గురించి స్పందిస్తూ కాల్చి చంప‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌ని మంత్రి ఈటల సంచలన కామెంట్లు చేశారు.

శాస్త్ర విజ్ఞానం మానవ కల్యాణం కోసం వాడాలని - అయితే.. మొబైల్ ఫోన్లు - టీవీలు వచ్చాక మనం మనుషులమేనా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. దారుణంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగడం మంచి పరిణామం కాద‌న్నారు. అత్యాచారాల లాంటి నేరాలకు ఉరి శిక్ష వేయడం, కాల్చి చంపడం అనే శిక్షలు శాశ్వత పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. మొట్టమొదట సమాజంలో మార్పు రావాలన్నారు మహిళలపై దాడులు - అఘాయిత్యాలపై వైద్యులు గ్రామీణప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కాగా, దేశ‌మంతా మ‌హిళ‌ల ఆకృత్యాల గురించి - అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న దుర్మార్గుల‌కు శిక్ష‌లు ప‌డ‌టంలో జాప్యం గురించి గొంతు ఎత్తుతున్న త‌రుణంలో ఈట‌ల రాజేంద‌ర్ స్పందించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా ఆయ‌న స‌మాజాన్ని విశ్లేషించాల్సింది పోయి ఇలా కామెంట్లు చేయ‌డం ఏంట‌ని అంటున్నారు. కాగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వామ‌ప‌క్ష భావాజాలాలు ఉన్న వ్య‌క్తి అని... అందుకే ఎన్‌ కౌంట‌ర్‌ ను స‌మ‌ర్థించ‌లేద‌ని ఆయ‌న గురించి తెలిసిన ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, తెలంగాణ ప్ర‌భుత్వంపై ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆరోగ్యం విషయంలో దేశంలోనే నంబర్‌ వన్‌ గా ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి శుద్ధజలం అందించి ఆరోగ్యంగా జీవించడంపై దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ మాదిరిగానే గిరిజన తండాలు - చెంచు పెంటల్లోనూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌ పై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చ తెలంగాణగా మారేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసి వాతావరణ సమతుల్యానికి పాటుపడుతున్నామన్నారు.