Begin typing your search above and press return to search.

మంత్రులకు జగన్ టార్గెట్.. ఉద్యోగులు బాబు ట్రాప్ లో పడొద్దు

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:45 AM GMT
మంత్రులకు జగన్ టార్గెట్.. ఉద్యోగులు బాబు ట్రాప్ లో పడొద్దు
X
గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని ప్రత్యేక పరిస్థితి తాజాగా ఏపీలోని జగన్ సర్కారుకు ఎదురైందన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి ఎదురయ్యే నిరసనలు.. ఆందోళనలు మాత్రమే చూసిన జగన్ సర్కారుకు మధ్య మధ్యలో వివిద వర్గాల ఆందోళనల్ని చూసినా.. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీగా ప్రభుత్వ ఉద్యోగులు.. అందునా ఉపాధ్యాయుల నిరసనలు ఆయన ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ప్రకటించిన పీఆర్సీతో గుర్రుతో ఉన్న ఉద్యోగులకు.. హెచ్ఆర్ఏ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఫాలో అవుతున్నట్లుగా చెప్పి ప్రకటించిన హెచ్ఆర్ఏ పుండు మీద కారం జల్లినట్లుగా మారింది.

ఇలాంటి వేళ ఉపాధ్యాయుల ఆందోళనలు ఒకపక్క.. మరోవైపు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగులు వార్నింగ్ ఇచ్చేసిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ కారణంగా ప్రభుత్వం మీద జీతాల భారం పెరిగిందని.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంతకు మించి చేయగలిగింది మరేమీ లేదన్న స్పష్టమైన సంకేతాల్ని సీఎం జగన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ప్రకటించిన పీఆర్సీతో జీతాలు తగ్గవని.. పెరుగుతాయని చెప్పిన సీఎం జగన్.. ఇదే విషయాన్ని మంత్రులు.. ఎమ్మెల్యేలు తమ దగ్గరున్న ఉద్యోగులతో మాట్లాడాలన్న లక్ష్యాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశంలో తాను మంత్రులతో షేర్ చేసుకున్న సమాచారాన్ని.. ఎమ్మెల్యేలకు కూడా పంపుతామని.. వారంతా తమ పరిధిలోని ఉద్యోగులతో మాట్లాడి.. ఆందోళనల్ని విరమించేలా చేయాలన్న టార్గెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని.. అలాంటి పరిస్థితుల్లోనే ఖజానాపై రూ.10,240 కోట్ల భారం పడుతున్నా పీఆర్సీ ఇచ్చామని.. జీతాలు తగ్గుతాయంటూ తప్పుదారి పట్టేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తాము ప్రకటించిన పీఆర్సీ శాతాల స్థాయి హెచ్ఆర్ఏనే కేంద్రం తన ఉద్యోగులకు ఇస్తుందని.. ఐదారు రాష్ట్రాల్లోనూ ఇంతే ఇస్తున్నారని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఈ కారణంతోనే 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామని.. ఆశా వర్కర్లు.. పారిశుద్ధ్యం కార్మికులు.. అంగన్ వాడీ కార్యకర్తలు.. వీఏవో.. యానిమేటర్లు.. ఇలా అందరికి జీతాలు పెంచామని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రామ.. వార్డు సచివాలయాల ద్వారా 1.28 లక్షల శాశ్విత ఉద్యోగాలను ఇచ్చిన వైనాన్ని వారికి గుర్తు చేయాలని కోరుతున్నారు. ఈ వాదనలు వినిపించి.. ఉద్యోగులు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మరి.. సీఎం దిశానిర్దేశం ప్రకారం ఎమ్మెల్యేలు వారి స్థాయిలో.. అధికారులతో మాట్లాడేక్రమంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో చూడాలి. మరి.. తాజాగా తమ ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ ఇచ్చిన టార్గెట్ ను ఎంతమేర రీచ్ అవుతారో చూడాలి.