Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీలకు ఉద్యోగ సంఘాల షాక్

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:16 AM GMT
రాజకీయ పార్టీలకు ఉద్యోగ సంఘాల షాక్
X
పీఆర్సీ వివాదం విషయంలో ఉద్యోగసంఘాలు రాజకీయపార్టీలకు పెద్ద షాకే ఇచ్చాయి. వివిధ సంఘాలన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా కొత్తగా ఏర్పడ్డాయి. ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మతో పాటు మీడియాకు కూడా చెప్పాయి. పనిలో పనిగా తమ పీఆర్సీ సాధన ఉద్యమంలోకి రాజకీయపార్టీలకు అనుమతి లేదంటు పెద్ద బాంబే పేల్చారు. ఎప్పుడైతే పీఆర్సీ విషయంలో తర్వాత హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వంతో ఉద్యోగసంఘాల నేతలకు వివాదం మొదలైందో వెంటనే రాజకీయపార్టీలన్నీ జోక్యం చేసుకున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యోగసంఘాలకు మద్దతు ప్రకటించాయి. అధికారంలో ఉన్నపుడు అసలు ఉద్యోగసంఘాలే ఉండకూడదని వార్నింగిచ్చిన చంద్రబాబునాయుడు కూడా ఇపుడు ఉద్యోగసంఘాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో మంత్రులు మాట్లాడుతు ప్రతిపక్షాల మాయలో పడద్దని వాస్తవాలంటో గ్రహించాలంటు అప్పీల్ చేశారు. సరే కారణాలు ఏవైనాకానీండి తమ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు ప్రవేశం లేదని ఉద్యోగుల నేతలు చెబుతారని రాజకీయపార్టీలు ఊహించలేదు.

అలాగే ఉద్యోగులెవరు ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడద్దని ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దని పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగులను హెచ్చరించారు. కొందరు టీచర్లు జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఒక టీచర్ మాట్లాడుతు తమ ఉసురు తగిలి జగన్ పోతాడంటూ శాపనార్ధాలు కూడా పెట్టింది. ఇలాంటి మాటలే చివరకు తమ ఆందోళనలకు చేటు తెస్తాయని ఉద్యోగ నేతలు గ్రహించారు.

మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా ఉద్యోగ నేతలు వాస్తవాలను గ్రహించినట్లున్నారు. ఉద్యోగుల ఆందోళనలను అడ్డం పెట్టుకుని కొన్ని పార్టీల నేతల ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటివారితో కలవటం వల్ల తమకు లాభం కన్నా నష్టమే ఎక్కువని ఉద్యోగ నేతలకు అర్ధమైనట్లుంది. అందుకనే స్పష్టంగా రాజకీయ పార్టీలకు అనుమతి లేదని, రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దని ప్రకటించారు. చివరకు ఉద్యోగుల ఉద్యమం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.