Begin typing your search above and press return to search.

విద్యుత్ బకాయిల రచ్చ..హైకోర్టు మెట్లెక్కిన ఏపీ జెన్‌కో

By:  Tupaki Desk   |   14 Sep 2021 7:30 AM GMT
విద్యుత్ బకాయిల రచ్చ..హైకోర్టు మెట్లెక్కిన ఏపీ జెన్‌కో
X
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక్క వాటర్ వార్ మాత్రమే కాదు విభజన పంచాయితీలు చాలానే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల విషయంలో, తెలుగు అకాడమీ ఆస్తుల విషయంలో, అనేక శాఖలకు సంబంధించి తెలంగాణలో ఉండిపోయిన ఆస్తుల విషయంలో ఏపీకి రావాల్సిన వాటాలపై వివాదం కొనసాగుతోంది. తమకు రావాల్సిన రూ. 6,283 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్‌ కో ఎండీ బి.శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌ లో పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని పిటిషన్‌ లో వివరించారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలే తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. డిస్కంల నుంచి బకాయిలు రావల్సి ఉంటే, వాటి నుంచి వసూలు చేసుకోవాలి కానీ జెన్ కోకు చెల్లించాల్సినవి నిలిపివేయడం సరికాదు. ఈ వివాదంపై మూడేళ్లుగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ లో విచారణ జరుగుతోంది.

ప్రభుత్వ రంగసంస్థల దివాలా ప్రక్రియపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, అక్కడ పిటిషన్‌ ను ఉపసంహరించుకున్నాం. మరోవైపు బొగ్గు సరఫరా, ఇతర సంస్థలకు బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. వడ్డీ సహా బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి అని పిటిషన్‌ లో ఏపీ జెన్‌ కో వెల్లడించింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన రూ.3,441 కోట్ల బకాయిలు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఏపీ జెన్ కో పిటిషన్‌ పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.

ఇక ఏపీ జెన్కో హైకోర్టులో వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అనేక విభజన పంచాయితీలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదాలు పరిష్కారం అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.