Begin typing your search above and press return to search.

మెర్సిడెస్ కారును ఆటోరిక్షా అధిగమించింది.. మంట పుట్టేలా 'మహా' సీఎం ట్వీట్

By:  Tupaki Desk   |   6 July 2022 3:07 AM GMT
మెర్సిడెస్ కారును ఆటోరిక్షా అధిగమించింది.. మంట పుట్టేలా మహా సీఎం ట్వీట్
X
అప్పటివరకు బిగ్ బాస్ గా ఉన్న పార్టీ అధినేత ముఖ్యమంత్రి కుర్చీని లాగేయటమే కాదు.. సదరు కుర్చీలో కూర్చున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఇప్పుడు వార్తల్లో ప్రముఖుడు అయ్యారు. సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసి.. శివసనే అధినేత కొడుకు చేతిలోని పవర్ ను లాగేసుకున్న ఆయన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అక్కడితో ఆయన.. తన ఎక్స్ బాస్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు.. మంట పుట్టేలా మాట్లాడటం లాంటి విషయాల్లోనూ అస్సలు తగ్గట్లేదు.

సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో బలపరీక్షతో తన సత్తా చాటే అవకాశం లేని వేళ.. ఉద్దశ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేయటం.. అనంతరం తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా సీఎం ఏకనాథ్ షిండే ట్వీట్ సంచలనంగా మారింది. తన సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మెర్సిడెజ్ బెంజ్ కారులో వచ్చిన ఉద్దేశ్ ఠాక్రేకు పంచ్ చేసేలా ఆయన తీరు ఉంది.

తనను ఉద్దేశించి ఆటోవాలా పేరుతో శివసేన నేతలు పలువురు మాటలు అన్న నేపథ్యంలో.. వాటికి బదులిచ్చేందుకు వీలుగా తన తాజా ట్వీట్ చేశారు. మెర్సిడెజ్ బెంజ్ ను ఆటో రిక్షా అధిగమించిందంటూ మరాఠీలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజా ట్వీట్ తో తానెంత సామాన్యమైన స్థాయి నుంచి పైకి వచ్చానన్న విషయాన్ని చెబుతూనే.. మరోవైపు ఉద్దవ్ సంపన్న జీవితాన్ని చాటి చెప్పేలా ఆయన వ్యాఖ్యాలు ఉండటం గమనార్హం.

ఆటో రిక్షా మెర్సిడెస్ కారును అధిగమించింది.. ఎందుకంటే ఇది సామాన్యుల ప్రభుత్వమంటూ షిండే ట్వీట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఉద్దవ్ ను ఇప్పుడు ఏ మెర్సిడెస్ బెంజ్ కారు పేరుతో ఎటకారం ఆడేస్తున్నారో.. గతంలోనూ ఇదే పేరుతో ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేపైనా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న కరసేవకుల పోరాటాన్ని అభినందించటం లేదంటూ మెర్సిడెస్ బేబీగా ఎటకారం ఆడేశారు. అప్పట్లో కొడుకును టార్గెట్ చేసిన తీరులోనే ఇప్పుడు తండ్రిని లక్ష్యంగా చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.