Begin typing your search above and press return to search.

పాత ప్రత్యర్ధి : జగన్ తో రణమే ...?

By:  Tupaki Desk   |   17 May 2022 4:49 PM GMT
పాత ప్రత్యర్ధి : జగన్ తో రణమే ...?
X
పాత ప్రత్యర్ధి కొత్తగా సీన్ లోకి వస్తే ఆ కధే వేరుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఇంటెరెస్టింగ్ గా ఉంటుంది. ఏపీలో అలాంటి ఆసక్తికరమైన సందర్భాన్ని జనాలు చూడోబోతున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. లాస్ట్ బాల్ అంటూ ఉమ్మడి ఏపీ సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి నాడు విభజన వేళ చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ తరువాత సమైక్యాంధ్రా పార్టీ పెట్టిన ఆయన తాను పోటీ చేయలేదు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారు ఓడారు. ఇక కిరణ్ మూడేళ్ళ సీఎం గా ఉన్నంతలో బెటర్ అనిపించుకున్నారు. అయితే ఆయన ఉన్న టైమ్ లో విభజన సమస్యలు, ప్రత్యేక ఉమ్మడి ఏపీ తెలంగాణ ఉద్యమాలతో అట్టుడికిపోయింది. ఇక మరో వైపు కాంగ్రెస్ ని చీల్చి జగన్ కొత్త పార్టీ పెట్టి వత్తిడి పెంచేశారు.

ఇలా అన్ని విధాలుగా ఇబ్బంది పడినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి 2014 తరువాత అడ్డగోలు విభజన చేశారంటూ కాంగ్రెస్ కి దూరం అయ్యారు. అయితే కొన్నేళ్ల క్రితం మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో చేరారు. దాంతో ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ కిరణ్ సైలెంట్ గానే ఉన్నారు.

తన దగ్గరకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు కానీ తాను మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆయన గుర్తుకు వస్తున్నారు. ఆయన్ని పిలిచి ఏపీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఇపుడు ఎలా ఉంది అంటే దాదాపుగా ఉనికి పోరాటం చేస్తోంది.

అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా కిరణ్ కి బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. అయితే ఏపీలో కిరణ్ కి పగ్గాలు అప్పగించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఎలాగంటే ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కూడా ఎవరూ కొట్టిపారేయలేరు. దానికి రాష్ట్రంలోని వాతావరణంతో పాటు జాతీయ పరిణామాలు కూడా కలసి వస్తాయని ఊహిస్తున్నారు.

కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. దాని ప్రభావం అంతో ఇంతో ఏపీ మీద కూడా ఉంటుంది. ఇక ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీలో ఉంది. వైసీపీ మీద జనాలలో వ్యతిరేకత ఎంతో కొంత పెరిగింది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ కి పెట్టుబడిగా ఉండే బలమైన రెడ్డి సామాజికవర్గం వైసీపీలో ఒక్క లెక్కన నలుగుతోంది.

దాంతో వారు పక్క చూపులు చూడవచ్చు అంటున్నారు. వారికి కాంగ్రెస్ కంటే సేఫెస్ట్ ప్లేస్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. ఇక బీజేపీ ఏపీకి ఏమీ చేయకపోవడం, విభజన హామీలు తుంగలోకి తొక్కడం, ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపధ్యంలో ఏపీలో కాంగ్రెస్ తిరిగి బలపడేందుకు వీలుంది అంటున్నారు.

వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే కనుక కాంగ్రెస్ కి ఎన్నో కొన్ని సీట్లు కూడా వస్తాయి. మొత్తానికి ఈ రోజుకు ఈ రోజు వైసీపీని ఢీ కొట్టలేకపోయినా ఎంతో కొంత అధికార పార్టీని దెబ్బతీయడానికి మాత్రం కిరణ్ సారధ్యం ఉపయోగపడుతుంది అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే కిరణ్ తో జగన్ వైరానికి పన్నెండేళ్ల చరిత్ర ఉంది.

నాడు ఉమ్మడి ఏపీలో జగన్ని అణచేస్తాను అని హై కమాండ్ వద్ద ప్రతిన చేసి సీఎం కుర్చీ ఎక్కిన కిరణ్ తన హయాంలో చేయాల్సింది అంతా చేశారు. అలా రాజకీయ ప్రత్యర్ధులుగా మారిన కిరణ్, జగన్ వైరం 2014లో ఫుల్ స్టాప్ పడిపోయింది. మళ్లీ 2022 నాటికి అంటే ఎనిమిదేళ్ళ తరువాత సమరానికి సై అని ఇద్దరూ అంటారా అన్నదే చూడాలి.