Begin typing your search above and press return to search.

స‌ల‌హాలిచ్చిన వ్య‌క్తిపైనే దొంగ‌త‌నం ఆరోపణ...ఈసీ చిత్రం

By:  Tupaki Desk   |   15 April 2019 6:02 AM GMT
స‌ల‌హాలిచ్చిన వ్య‌క్తిపైనే దొంగ‌త‌నం ఆరోపణ...ఈసీ చిత్రం
X
ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని - విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 20మంది బృందంతో చంద్రబాబు ఈసీని కలిసి 18 అంశాల మీద కంప్లయింట్ చేశారు. అందులో ఈవీఎంల మొరాయింపు ముఖ్యమైంది. చంద్రబాబు ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు ఈసీ రెడీ అయి ఈవీఎంలపై అనుమానాల నివృత్తికి భేటీ ఏర్పాటు చేసింది. ఈవీఎంలపై టీడీపీకి ఉన్న అభ్యంతరాలను తెలిపాలని చెప్పింది. టీడీపీ నుంచి టెక్నికల్ నిపుణులను పంపాల్సిందిగా సూచించింది. ఇందుకు టీడీపీ పేర్లు సూచించగా చంద్రబాబు బృందంలో ఈవీఎం దొంగ ఉన్నాడని వేమూరు హ‌రిప్ర‌సాద్ పేరును పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈవీఎం దొంగతో మేము చర్చలు జరపము అని ఈసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. చంద్రబాబుకి ఘాటుగా లేఖ రాసింది.

అయితే, దీనికి అంతే ఘాటుగా తెలుగుదేశం పార్టీ కౌంట‌ర్ ఇచ్చింది. హరిప్రసాద్ ను పంపడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని టీడీపీ తప్పుపట్టింది. హరిప్రసాద్ పై కేసులు ఉంటే మీకొచ్చిన సమస్య ఏంటి అని టీడీపీ నేతలు ఈసీని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు పార్టీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ లేఖ రాశారు. ఈవీఎంల వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఈసీ ఇలా చేస్తోందని ఆరోపించారు. ``2010లో అమెరికా - నెదర్లాండ్స్‌ కు చెందిన రచయితలతో కలసి హరిప్రసాద్ రీసెర్చ్ పేపర్లు సమర్పించారు. ఆ తర్వాత ఆయన్ను గతంలో సీఈసీలుగా పనిచేసిన డాక్టర్ ఎస్‌వై. ఖురేషీ - వీఎస్ సంపత్‌ లు హరిప్రసాద్ నుంచి సూచనలను స్వీకరించాయి. ఆ తర్వాత వీవీప్యాట్‌ లను డిజైన్ చేశారు. 2011లో వీవీప్యాట్‌ ల మీద నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్‌ కు కేంద్ర ఎన్నికల కమిషన్ హరిప్రసాద్‌ ను కూడా ఆహ్వానించింది. అలా స‌ల‌హా తీసుకున్న వ్య‌క్తి నేడు దొంగ అవుతారా?`` అంటూ ప్ర‌శ్నించారు. హరిప్రసాద్‌ ను భేటీకి అనుమతించాలని ఈసీని కోరారు. ఈవీఎంల పనితీరుపై చర్చించాలని అంటే.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని అదే సమయంలో అసలు హరిప్రసాద్‌ కు సంబంధించిన కేసులో చార్జ్‌ షీట్‌ లేదని - ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు టీడీపీ టెక్నికల్‌ నిపుణుడు హరిప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే - సీఈసీ తనను వద్దని అంటుందని హరిప్రసాద్ వెల్ల‌డించారు. 2010లో తనపై కేసుకు సంబంధించి ఛార్జిషీటే దాఖలు కాలేదని - అలాంటప్పుడు తనపై కేసు ఉందని ఈసీ చెప్పడం కరెక్ట్ కాదని హరిప్రసాద్‌ చెప్తున్నారు. ఈసీ తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి మెలిక పెడుతుందని ఆరోపించారు.

కాగా, హైదరాబాద్‌ కేంద్రంగా నెట్‌ ఇండియా అనే ఐటీ కంపెనీకి ఎండీగా ఉన్న హరిప్రసాద్‌ 2010 ఏప్రిల్‌ 29న ఒక టీవీ చానల్‌ లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ పై ఒక ప్రదర్శన ఇచ్చారు. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హరిప్రసాద్‌ చేతిలోని ఈవీఎంపై దృష్టి పెట్టిన ఈసీ.. అది ముంబైలో చోరీకి గురైనదిగా తేల్చింది.