Begin typing your search above and press return to search.

సజ్జలకు బదులుగా ఇలాంటోళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించాలి జగన్

By:  Tupaki Desk   |   29 July 2021 5:05 AM GMT
సజ్జలకు బదులుగా ఇలాంటోళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించాలి జగన్
X
మిగిలిన రంగాలకు భిన్నమైనది రాజకీయం. ఎక్కడైనా మంచిని హైలెట్ చేస్తారు. చెడును కాస్త టోన్ డౌన్ చేస్తారు. కానీ.. రాజకీయాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మంచి గురించి ఏ మాత్రం చెప్పినా తాటాకులు కట్టేస్తారు. ఏదో ఒక రంగు పూసేస్తారు. అయినా.. రాజకీయాల్లో మంచి చేసే వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మంచి గురించి అందరికి తెలుస్తుంది కదా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తాయి. అయితే.. చెడు గురించి ఏ తీరులో అయితే చెబుతామో.. మంచి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. అవేమీ అవసరం లేదన్నట్లుగా ఉంటుంది.

ఏపీ విషయానికి వస్తే ప్రతిది రాజకీయ కోణంలోనే చూస్తారు. పలువురు విమర్శలు చేస్తున్నట్లుగా.. ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడకుండా ఉంటేనే.. ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. కానీ.. ఆయన మాట్లాడటం.. రాజకీయ విమర్శలు చేయటం తరచూ వేలెత్తి చూపేలా ఉంటుంది. రాజకీయాల గురించి మాట్లాడటానికి వైసీపీలో బోలెడంత మంది ఉన్నారు కదా? అలాంప్పుడు వారికి రాజకీయాల్ని వదిలేసి.. మిగిలిన అంశాలకు సజ్జల పరిమితమైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం బోలెడన్ని అప్పులు తెస్తోందని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న విమర్శలు.. ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇందులోని వాస్తవాస్తావాల్ని తెలియజెప్పే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. ఆయన చెప్పిన మాటలతో కొందరు విభేదించొచ్చు. కానీ.. ఆయన వాదనలోనూ అర్థముందన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కొన్ని అంశాల్ని రాజకీయ కోణానికి భిన్నంగా విషయాల్ని.. విషయాలుగా ప్రస్తావించటం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన సమాచారాన్ని తెలిపే వీలు ఉంటుంది.

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి.. ఇటీవల కాలంలో తెస్తున్న అప్పులపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. పలు ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. ఆయనేమన్నారంటే..

- కోవిడ్‌ సమయంలో ప్రజల కష్టాలను తీర్చడానికి పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. ప్రతిపక్షంతో పాటు కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చాలనే కుట్రలో భాగంగా తప్పుడు రాతలు, దుష్ప్రచారం చేస్తున్నాయి.

- అప్పులన్నీ కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రజల జీవనోపాధి కోసమే వ్యయం చేసింది. నేరుగా నగదు బదిలీ ద్వారా ప్రజల ఖాతాలకు రూ.లక్ష కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఆర్ధిక మందగమనం సమయంలో అప్పు చేసైనా ప్రజలకు డబ్బులు అందించాలన్నది ఆర్ధిక నిపుణుల సూత్రం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. అదే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఇందులో తప్పేమీ లేదు.

- 2019 – 20 నుంచే ఆర్ధిక మందగమనం ప్రారంభమైంది. ఆ ఆర్ధిక ఏడాదిలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.6,591 కోట్లు తగ్గిపోయాయి. కోవిడ్‌ కారణంగా కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన రాబడిలో రూ.7,780 పాటు రాష్ట్ర పన్నుల రాబడి రూ.7,000 కోట్లు తగ్గిపోగా మరో పక్క కరోనా నివారణ, నియంత్రణ చర్యల కోసం అదనంగా రూ.8,000 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడింది.

- అప్పులు ఎక్కువ కావటానికి ప్రధాన కారణం.. గత సర్కారు రూ.1,20,556 కోట్ల అప్పులను రూ.2,68,115 కోట్లకు పెంచేసింది. ఎక్కడా మౌలిక వసతుల కల్పనకు వ్యయం చేయలేదు. బడ్జెట్‌ బయట మరో రూ.58 వేల కోట్లు అప్పు చేయడమే కాదు.. మూడు ఆర్ధిక సంవత్సరాల్లో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పు చేసింది.

- టీడీపీ సర్కారు దిగిపోయేనాటికి ఏకంగా రూ.38,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టింది. విద్యుత్‌ రంగంతో పాటు డిస్కమ్‌ల పేరిట భారీ అప్పులు చేసింది. బిల్లులు బకాయిలు పెట్టింది. గత సర్కారు తీసుకున్న అప్పులను ఉత్పాదక రంగంపై వెచ్చించకపోగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసింది.

- టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పింది. దేశంలో వ్యవసాయ కుటుంబాలు సగటున 47 శాతం అప్పుల్లో ఉండగా రాష్ట్రంలో ఏకంగా 77 శాతం అన్నదాతల కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు సర్వే తెలిపింది. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాథమిక విద్య గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో దేశ సగటు 99 శాతం కాగా అత్యల్పంగా రాష్ట్రంలో కేవలం 84.48 శాతమే ఉంది.

- ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని బడ్జెట్‌లో చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం భూములను విక్రయించకుండా కేవలం తనఖా పెట్టడం ద్వారా రుణాలను సమీకరిస్తోంది.