Begin typing your search above and press return to search.

ఒక్క పెగ్ వేసినా గుండెకు ముప్పే! ఆందోళ‌న రేపుతున్న ఓ స‌ర్వే

By:  Tupaki Desk   |   31 May 2020 4:21 AM GMT
ఒక్క పెగ్ వేసినా గుండెకు ముప్పే! ఆందోళ‌న రేపుతున్న ఓ స‌ర్వే
X
బీరు క‌న్నా మందు అంటే వైన్ కొద్దిగా ఆరోగ్యానికి మంచిద‌ని వైద్యులే చెబుతుంటారు. అందుకే రోజుకు ఒక పెగ్ తీసుకుంటే ఎలాంటి ముప్పు లేద‌ని సూచిస్తుంటారు. అయితే తాజాగా వ‌చ్చిన నివేదిక అది కూడా ముప్పేన‌ని తేల్చింది. రోజుకు ఒక పెగ్ కూడా తీసుకున్నా గుండెకు చేటు అని చెబుతోంది. ఈ విష‌యం వేల‌మందికి ప‌రీక్ష‌లు చేస్తే తేలింద‌ని ఓ ప‌త్రిక తెలిపింది. స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తరు స్థాయి వరకు మద్యం తాగినా రక్తపోటు పెరుగుతుందని - గుండెపోటు ముప్పు పెరిగే ఆస్కారముందని ఆరోగ్య పత్రిక (హెల్త్ న్యూస్ పేప‌ర్‌) 'ద లాన్సెట్ చేసిన అధ్యయనంలో వెల్ల‌డైంది. ఈ అధ్య‌య‌నాన్ని విస్తృతమైనదిగా బ్రిటన్ - చైనా పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు ఐదు లక్షల మంది చైనీయులపై పదేళ్లపాటు పరిశీలన చేశారంట‌. ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయని ఆ ప‌త్రిక తెలిపింది. ఆరోగ్యంపై మద్యం నేరుగా చూపే ప్రతికూల ప్రభావానికి ఇవే ఆధారాలని స్ప‌ష్టం చేసింది.

అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని ఇన్నాళు మ‌న‌కు తెల‌య‌వ‌గా ఇప్పుడు కొద్దిగా పుచ్చుకున్నా కూడా ప్ర‌మాద‌మేన‌ని ఈ అధ్య‌య‌నం చెబుతోంది. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని ఇన్నాళ్లు ఉండ‌గా అది కూడా త‌ప్పేన‌ని.. ముప్పేన‌ని పేర్కొంది. మద్యపానానికి సురక్షితమైన స్థాయి అంటూ ఉండదని వెల్ల‌డించింది. ఈ అధ్యయనాన్ని బ్రిటన్‌ లోని ఆక్స్‌ ఫర్డ్ విశ్వవిద్యాలయం - చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం - చైనీస్ వైద్యశాస్త్రాల అకాడమీ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ అధ్యయనంలో తేలిన విష‌యాలు

- రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది.

- రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతం పెరుగుతుంది.

ఈ అధ్యయనం ప్రకారం ఒక పెగ్గు (స్పిరిట్స్) - సీసా బీరు - చిన్న గ్లాసంత వైన్‌ దాదాపు ఒకే ప్రభావాన్ని చూపుతాయని ఆ ప‌త్రిక త‌న అధ్య‌య‌నంలో పేర్కొంది. ఈ మూడు రకాల మద్యాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకుని అధ్య‌య‌నం చేయ‌గా ఈ ఫ‌లితం వ‌చ్చింది. ఈ అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే గుండెపోటు ముప్పు 38 శాతం పెరుగుతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టర్ వెల్ల‌డించారు. ఏదైనా మ‌ద్యం స్వల్పంగా తీసుకున్నా.. మోస్తరుగా తీసుకున్నా ప్ర‌మాద‌మేన‌ని - గుండెపోటు ముప్పు త‌ప్ప‌ద‌ని స్పష్టం చేసింది. మ‌ద్యం అంటేనే ముప్పు అని ఒక్క‌మాట‌లో చెప్పేసింది. గుండెపోటు శ‌రీర అవయ‌వాలు దెబ్బ‌తిన‌డం వంటి ప్ర‌భావాలు చోటుచేసుకుంటాయ‌ని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు. దీనిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్య గణాంకాలు - సాంక్రమిక వ్యాధుల విజ్ఞాన విభాగానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ పెటో ఈ విష‌యంపై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేశారు. ఇందులో భాగంగానే అధ్య‌య‌నంలో మద్యపానం ప్రభావాలపై అధ్యయనానికి తూర్పు ఆసియా దేశాలు అనువైనవని పేర్కొన్నారు. చైనీస్ మూలాలున్న చాలా మంది ప్రజల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు వారిని మద్యపానానికి దూరంగా ఉంచుతాయని తేలింద‌ని తెలిపారు. మద్యం తాగితే వారిపై ప్రతికూల ప్రభావం వెంట‌నే కనిపిస్తుందని, అస్వస్థతకు గుర‌వుతార‌ని వివ‌రించారు. చైనాలో ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి మద్యపానం అలవాటు ఉండదని గుర్తించారు. మహిళలు అతి కొద్ది మందే మద్యం తాగుతారని పేర్కొంది. ఈ ల‌క్ష‌ణాలు పశ్చిమ దేశాల ప్రజల్లో ఉండవని స్ప‌ష్టం చేసింది. ఇది చైనీయులపై మాత్రమే జరిపిన అధ్యయనమని ఆ ప‌త్రిక త‌న నివేదిక‌లో తెలిపింది. ఇది స్పిరిట్స్ - బీర్ తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని - వైన్‌ పై దృష్టి కేంద్రీకరించలేదని వెల్ల‌డించింది.

ఏది ఎక్క‌డ ప‌రిశోధ‌న‌ - అధ్య‌య‌నం చేసినా మ‌ద్యం అనేది ఆరోగ్యానికి హానిక‌ర‌మే. ఈ విష‌యాన్ని గుర్తించి మ‌ద్యం మానివేస్తే మంచిది. ముఖ్యంగా దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్నవారు మ‌ద్యం జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే వారి ఆయుషు కొన్నాళ్లు పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తుంది.