Begin typing your search above and press return to search.

బాబు ఈజ్ ఏ బచ్చా..నేను నిమిషానికి కోటి రూపాయలు సంపాదించగలను

By:  Tupaki Desk   |   18 April 2019 4:28 PM GMT
బాబు ఈజ్ ఏ బచ్చా..నేను నిమిషానికి కోటి రూపాయలు సంపాదించగలను
X
ఏపీ పాలిటిక్సులో కమెడియన్‌ గా మారిపోయినప్పటికీ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఎవాంజలిస్ట్ కేఏ పాల్ ఎందుకో ఏపీలో తనపై జరుగుతున్న కామెడీని ఏమాత్రం సీరియస్‌ గా తీసుకోకుండా ఇంకా కామెడీ పండిస్తున్నారు. అయితే.. నిత్యం కామెడీ పండించే ఆయన అప్పుడప్పుడు సీరియస్ కూడా అవుతుంటారు. సాధారణంగా మీడియా ఎంత కవ్వించినా కూడా భరించే పాల్ తాజాగా మాత్రం ఓ చానల్‌ లో మాట్లాడుతూ యాంకర్‌ పై సీరియస్ అయ్యారు. అంతేకాదు... చంద్రబాబు - జగన్‌ లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన ముందు బచ్చా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆగ్రహానికి లోనయ్యారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందనే ఈ ఇంటర్వ్యూకి వచ్చాను అంటూ మొదలుపెట్టి అనేక అంశాలపై మాట్లాడారు. మళ్లీ మోదీ నాయకత్వం రాకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పిన కేఏ పాల్ ... నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను - నా సమయం వృథా చేయొద్దని యాంకర్ పై మండిపడ్డారు. మీరు వ్యక్తిగత ప్రశ్నలు అడగొచ్చు కానీ మేం ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదా? అంటూ చిందులేశారు.

"నేను చంద్రబాబు లాగా - జగన్ లాగా - కాంగ్రెస్ నేతల్లాగా లక్షల కోట్లు దోచుకోలేదు. నా సొంత సంపాదననే 37 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో డొనేట్ చేస్తున్నాను" అంటూ చెబుతుండగా - టీవీ యాంకర్ అందుకుని - ఇన్ని చేస్తున్న మిమ్మల్ని ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదు? అంటూ కవ్వించే ప్రయత్నం చేశారు. దానికి తోక తొక్కిన తాచులా లేచిన కేఏ పాల్ - నా ముందు బచ్చాలు వీళ్లందరూ అంటూ మండిపడ్డారు. "చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా. జగన్ ఓ క్రిమినల్. పవన్ కల్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంతా నేషనల్ లీడర్స్ తోనే రాజకీయాలు చేస్తాను - కపిల్ సిబాల్ - అహ్మద్ పటేల్ పెద్దనాయకులా? మీరు చెబుతున్న చంద్రబాబు - జగన్ పెద్ద నాయకులా?" అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు.