Begin typing your search above and press return to search.

ట్రంప్ మ‌ళ్లీ కెలికాడు..క‌శ్మీర్‌ లో మ‌తం గురించి క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   21 Aug 2019 12:49 PM GMT
ట్రంప్ మ‌ళ్లీ కెలికాడు..క‌శ్మీర్‌ లో మ‌తం గురించి క‌ల‌క‌లం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో వివాదాస్ప‌ద అంశం స్పందించారు. భారత్- పాకిస్థాన్ కోరితే కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు గ‌తంలో చెప్పడం ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించడం తెలిసిన సంగ‌తే. అయిన‌ప్ప‌టికీ, డొనాల్డ్ ట్రంప్ త‌న బుద్ధి మార్చుకోలేదు. ఈ ద‌ఫా మ‌త ప్ర‌స్తావ‌న తెచ్చి వివాదం రేపారు. క‌శ్మీర్ వివాదం సంక్లిష్టంగా మారింద‌ని ట్రంప్ పేర్కొన్నాడు. ఇది రెండు మ‌తాల‌కు సంబంధించిన అంశంగా త‌యారైంద‌ని, మ‌తం అనేది అత్యంత క్లిష్ట‌మైన అంశ‌మ‌ని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించి

పాక్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లి వైట్‌ హౌస్‌ లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వహించడాన్ని నేను ప్రేమిస్తా.. ఒకవేళ అవసరమైతే క‌శ్మీర్ స‌మ‌స్య‌పై నేను సాయపడుతా అని అన్నారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా త‌న‌ను భారత్ ప్రధాని మోదీ జీ20 స‌ద‌స్సులో స్వయంగా కోరినట్లు లీకులు ఇచ్చారు. ట్రంప్ కామెంట్ల‌ను పాకిస్థాన్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ స్వాగతించారు. కానీ భారత్ మాత్రం తృతీయ పక్షం జోక్యానికి తావు లేదని స్పష్టం చేసింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌మ‌ని ట్రంప్‌ను మోదీ కోర‌లేద‌ని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. పాక్‌ తో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ద్వైపాక్షికంగానే చ‌ర్చిస్తామ‌ని మంత్రి తెలిపారు.

ఇలా వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకుంటున్న త‌రుణంలో...మ‌ళ్లీ ట్రంప్ కెలికారు. ఇమ్రాన్‌- మోదీతో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, కానీ ప్ర‌స్తుతం వాళ్లిద్ద‌రూ స్నేహితుల్లా లేర‌ని ట్రంప్ తెలిపారు. భార‌త్‌-పాక్ మ‌ధ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌కంగా ఉంద‌ని, దీంట్లో మ‌త స‌మ‌స్య‌గా కూడా ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. అయితే మ‌తం అనేది అత్యంత క్లిష్ట‌మైన అంశ‌మ‌న్నారు. త‌న వాద‌న‌ను బ‌ల‌ప‌రుచుకునేందుకు ట్రంప్‌.. క‌శ్మీర్ చ‌రిత్ర‌కు సంబంధించిన కొన్ని అంశాల‌ను కూడా వెల్ల‌డించారు. క‌శ్మీర్ గురించి రెండు ప్రాంతాల మ‌ధ్య స‌మ‌స్య ఉంద‌ని, ఆ ప్రాంతం కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి స‌మ‌స్య‌గా త‌యారైంద‌ని, క‌శ్మీర్ ఓ సంక్లిష్ట‌మైన ప్రాంత‌మ‌ని, అక్క‌డ హిందువులు- ముస్లింలు ఉన్నార‌ని, కానీ ఈ రెండు మ‌తాల‌కు చెందిన‌వారు క‌లిసి ఉండ‌డం లేద‌ని తాను అన‌డంలేద‌ని ట్రంప్ తెలిపారు. కానీ క‌శ్మీర్‌ లో ప‌రిస్థితి భ‌యాన‌కంగా ఉంద‌ని ట్రంప్ అన్నారు. క‌శ్మీర్‌ లో ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. రెండు దేశాల మ‌ధ్య పెను స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ఆ స‌మస్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ పున‌రుద్ఘాటించారు. ఓవ‌ల్ ఆఫీసులో రొమేనియా అధ్య‌క్షుడు కాల‌స్ ఐయోనిస్‌ తో స‌మావేశానికి ముందు ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కాగా, ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై భార‌త్ స్పందించాల్సి ఉంది.