Begin typing your search above and press return to search.

తమిళనాడులో జాతీయపార్టీల పరిస్ధితేంటో తెలుసా ?

By:  Tupaki Desk   |   9 May 2021 5:48 AM GMT
తమిళనాడులో జాతీయపార్టీల పరిస్ధితేంటో తెలుసా ?
X
తమిళనాడులో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక ఎన్నికలో జాతీయ పార్టీలను ఆదరించిన ఓటర్లు మరో ఎన్నికలో మాత్రం కేవలం ప్రాంతీయపార్టీలను మాత్రమే ఆదరిస్తుంటారు. అంటే జాతీయ, ప్రాంతీయపార్టీలకు భిన్నరీతుల్లో జనాలు ఆదరిస్తున్న విషయం అర్ధమైపోతోంది. రాష్ట్రంలో అధికారం ఏపార్టీకి ఇవ్వాలనే విషయంలో జనాలు కేవలం ప్రాంతీయపార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను మాత్రమే ఆదరిస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తేమాత్రం జాతీయపార్టీ వైపు కూడా కాస్త మొగ్గుచూపుతుంటారు.

తాజాగా జరిగిన ఎన్నికలో ఈ విషయం స్పష్టమైపోయింది. తమిళనాడులో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకుని 54 సంవత్సరాలైపోయింది. కాంగ్రెస్ పార్టీ నుండి చివరిసారిగా ముఖ్యమంత్రయిన నేత మింజూరు భక్తవత్సలం మాత్రమే. 1967లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అయితే డీఎంకే లేకపోతే ఏఐఏడీఎంకే పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి.

డీఎంకే చీఫ్ కరుణానిధి, ఏఐఏడీఎంకే చీఫ్ జయలలిత లేకుండా జరిగిన మొదటి ఎన్నికల్లో కుణానిధి వారసుడు, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన తర్వాత తమిళనాడులో రాజకీయంగా విచిత్రమైన పరిస్ధితులు మొదలయ్యాయి. యావత్ ధక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఏపి, కర్నాటక, కేరళలో అధికారంలో ఉన్నా తమిళనాడులో మాత్రం సాధ్యంకాలేదు. భస్మారసుర హస్తంలాగ ఇపుడు సమైక్యాంధ్రను విడదీసి తెలంగాణా-ఏపిగా విడదీసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కు తమిళనాడు గతే పడుతుందేమో.

తమిళనాడులో గడచిన 50 ఏళ్ళుగా అధికారంలో ఉన్న డీఎంకే-ఏఐఏడీఎంకేలు ఎన్నికల్లో కత్తులు నూరుకుంటాయి. అధికారాన్ని అందుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తాయి. అంతేకానీ జాతీయపార్టీలకు మాత్రం చోటు కల్పించవు. కాకపోతే ఏదో తోకపార్టీల్లాగ పొత్తులు పెట్టుకున్నపుడు నాలుగు సీట్లిస్తాయంతే. అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు సీట్లను కూడా జాతీయపార్టీలకు కొన్ని కేటాయిస్తుంటాయి. దీనివల్ల కేంద్రప్రభుత్వంలో కూడా డీఎంకే, ఏఐఏడీఎంకేలు చక్రం తిప్పుతున్నాయి. మొత్తానికి తమిళనాడులో జాతీయ పార్టీలు అధికారానికి దూరమై ఐదు దశాబ్దాలైపోయిందన్నది వాస్తవం.