Begin typing your search above and press return to search.

కోన‌సీమ విధ్వంసంపై దాఖ‌లైన పిల్ కొట్టివేత‌!

By:  Tupaki Desk   |   25 Jun 2022 6:30 AM GMT
కోన‌సీమ విధ్వంసంపై దాఖ‌లైన పిల్ కొట్టివేత‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును పెడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మే 24న అమ‌లాపురంలో అల్ల‌ర్లు, విధ్వంసం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కేసులో పోలీసులు 200 మందికి పైగా అరెస్టు చేశారు.

విచార‌ణ‌కు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేశారు. నిందితుల‌పై రౌడీషీట్లు మోప‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే మంత్రి విశ్వ‌రూప్, ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ ఇళ్ల‌ను, ప‌లు ప్రైవేటు, ఆర్టీసీ బ‌స్సుల‌ను, పోలీసు వాహ‌నాల‌ను ద‌హనం చేసిన‌వారి ఆస్తుల స్వాధీనానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ హింసాత్మక ఘటనలపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యాజ్యాలు ప్రచారం కోసం లేదా రాజకీయ ప్రయోజనం కోసం దాఖలు చేస్తుంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిస్సార వ్యాజ్యాలు దాఖలుచేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఈ క్ర‌మంలో పిటిష‌న‌ర్ కు 25 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించ‌డానికి హైకోర్టు సిద్ధ‌మైంది. అయితే పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది క్ష‌మాప‌ణ కోర‌డంతో హైకోర్టు ఆ జ‌రిమానాను ఉప‌సంహ‌రించింది. ఈ మేర‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

కోనసీమ అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌ర‌ఫున‌ న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అల్లర్లలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ పాత్ర ఉందన్నారు. ఇంకా మ‌రికొంద‌రు అధికార పార్టీ నేత‌లు ఈ విధ్వంసంలో ఉన్నార‌ని తెలిపారు. వారిని పోలీసులు నిస్ప‌క్ష‌పాతంగా విచారించ‌డం లేద‌ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ..

రాజకీయ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. నిరర్థక పిల్‌ వేసినందుకు రూ.25 లక్షలకు తక్కువ కాకుండా జ‌రిమానా విధిస్తామని హెచ్చరించింది. జ‌రిమానా విధించొద్ద‌ని న్యాయవాది అభ్యర్థించి, క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.