Begin typing your search above and press return to search.

సేమ్ ప్లేస్.. సేమ్ టైం.. దిశ ఆత్మకు శాంతి లభించిందా?

By:  Tupaki Desk   |   6 Dec 2019 4:06 AM GMT
సేమ్ ప్లేస్.. సేమ్ టైం.. దిశ ఆత్మకు శాంతి లభించిందా?
X
వెటర్నరీ వైద్యురాలు దిశ ను దారుణమైన రీతి లో హత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో మరణించారు. అధికారికంగా ఈ వివరాలు బయటకు వెల్లడి కానప్పటికీ.. ఘటనా స్థలం లో చోటు చేసుకున్న పరిణామాలతో వివరాలు బయటకు వచ్చాయి. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యం లో చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితుల్ని (ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు) సీన్ రీకన్ స్ట్రక్షన్ జరిపేందుకు వీలుగా దిశను కాల్చేచిన ప్రదేశానికి తీసుకెళ్లారు.

అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. లారీ లో నుంచి దిశను ఎలా కిందకు దింపారు? కాల్చేసిన ప్రాంతానికి ఎలా తీసుకెళ్లారు? అప్పుడు నలుగురు ఎమేం చేశారు? ఆమె మీద పెట్రోల్ చల్లిందెవరు? నిప్పు పెట్టిందెవరు? ఆమె మొబైల్ లోని సిమ్ కార్డును మంటల్లో వేయగా.. ఫోన్ ను పాతి పెట్టిన ప్రదేశం ఎక్కడ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దిశను కాల్చి చంపిన ప్రదేశానికి దగ్గర్లోనే.. ఇంచుమించు ఆమెను కాల్చి చంపిన సమయం లోనే నిందితులు ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లారట. అక్కడ దిశ ఉదంతం లో ప్రధాన నిందితుడైన ఆరిఫ్ తొలుత పోలీసుల పై దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో మిగిలిన ముగ్గురు కూడా పోలీసుల పై తిరబడే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం.

పోలీసుల చేతుల్లో ఉన్న తుపాకులు లాక్కునే ప్రయత్నం చేయగా.. అది సాధ్యం కాలేదట. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై నిందితులు రాళ్లు విసిరినట్లుగా తెలుస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నిందితుల పై కాల్పులు జరిపినట్లు గా చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో దిశ నిందితులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దిశను తగల పెట్టిన సమయం.. నిందితుల ఎన్ కౌంటర్ సమయం ఇంచుమించు ఒకటే కావటం గమనార్హం. తాజా పరిణామంతో దిశ ఆత్మకు శాంతి లభించినట్లుగా చెప్పక తప్పదు.