Begin typing your search above and press return to search.

డిగ్గీలాంటోళ్లు ఒక్కరు చాలు కాంగ్రెస్ ను ఖతం చేయటానికి

By:  Tupaki Desk   |   24 Jan 2023 11:00 AM GMT
డిగ్గీలాంటోళ్లు ఒక్కరు చాలు కాంగ్రెస్ ను ఖతం చేయటానికి
X
అయిన పెళ్లికి భాజాలు అయినా ఫర్లేదు. ఒక విషయాన్ని యావత్ దేశం మొత్తం బలంగా నమ్మిన అంశం తప్పు అని చెప్పటం తప్పేం కాదు. కానీ.. సమయం, సందర్భంతో పాటు.. దానికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. దానికి బదులుగా మరో మార్గాన్ని ఎంచుకోవటం చాలామంచిది.

ఇలాంటి చిన్న విషయాలు తలపండిన రాజకీయ నేతలైన కొందరు ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ద్విగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ ప్రస్తుతం నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల్లో సభలు, సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా జమ్మూలో బహిరంగ సభను నిర్వహించారు డిగ్గీ. ఆ సందర్భంగా మోడీ సర్కారు చేసినట్లు చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్ లో నిజం లేదని.. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలంతా ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిగ్గీ కోరారు.

ఇలాంటి వ్యాఖ్యలతో వచ్చే నష్టాన్ని గుర్తించిన మరో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ముందుకు వచ్చారు. డిగ్గీ వెంట ఉన్న ఆయన.. డిగ్గీ వ్యాఖ్యలతోకలిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేవారు. సర్జికల్ స్ట్రైక్స్ మీద ద్విగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వానికి ముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రైక్స్ ను చేపట్టినట్లుగా చెప్పారు.

దేశ ప్రయోజనాల కోసం సైన్యం చేసే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పటికి ఉంటుందని డ్యామేజ్ కంట్రోల్ చేసే పని చేపట్టారు. అయితే.. ఇలాంటి విషయాల మీద మాట్లాడే ముందు పార్టీ పరంగా ఎలాంటి లైన్ తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగి.. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. వ్యహాత్మకంగా తమ వాదనను వినిపించాలి. అందుకు అవసరమైన ఆధారాల్ని చూపించాల్సి ఉంది.

ఇదేం లేకుండా.. నోటికి వచ్చినట్లుగా సర్జికల్స్ స్ట్రైక్స్ మీద డిగ్గీ మాష్టారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. దీనిపై వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మిగిలిన కాంగ్రెస్ నేతల మీద పడటం ఇబ్బందిగా మారింది. ఇదంతా చూసినప్పుడు.. ద్విగ్విజయ్ లాంటి ఒకరిద్దరు చాలు.. కాంగ్రెస్ లాంటి పార్టీని ఖతం చేయటానికి అన్న భావన కలగక మానదు. భావోద్వేగ అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న డిగ్గీలాంటి వాళ్ల నోళ్లకు తాళాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.