Begin typing your search above and press return to search.

‘సీమ’ పరువు తీయటానికే జేసీ డిసైడ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 AM GMT
‘సీమ’ పరువు తీయటానికే జేసీ డిసైడ్ అయ్యారా?
X
కొన్ని అబద్ధాలు నిజాలుగా నిరూపితమైన వేళ.. వాటిని పదే పదే ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ.. వాటిని అబద్ధాలుగా ఫ్రూవ్ చేయాలన్నదే లక్ష్యమైతే.. దానికి పక్కా ప్రణాళిక అవసరం. అంతే కాదు.. మడమ తిప్పకుండా.. దేనికైనా.. ఏ త్యాగానికైనా సిద్ధం.. విషయం అందరికి తెలియాలన్నట్లుగా పోరాడే తత్త్వమన్నా ఉండాలి. కానీ.. ఇలాంటివేమీ లేని వారిగా ఏపీ నేతల గురించి తరచూ వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన వేళలో.. ఏపీకి చెందిన నేతలంతా తమ వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచిస్తే.. అందుకు భిన్నంగా తెలంగాణ రాజకీయ నేతలు మాత్రం తమ చిరకాల స్వప్నం గురించి పోరాడారు. ఈ క్రమంలో ఏపీ మీదా.. ఏపీ నేతల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఘాటు విమర్శలు చేయటానికి వెనుకాడలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అయ్యింది. ఇప్పుడు విభజన గురించి మాట్లాడే ఆసక్తి.. దాని గురించి చర్చించాలన్న కుతూహలం ఏపీ ప్రజలకు ఏ మాత్రం లేదు. అయితే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఏ సందర్భంలో.. ఎలా సాధించామన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజల్ని కాకుండా ఏపీ రాజకీయ నేతల్ని.. ఉమ్మడి రాష్ట్ర పాలకుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంటారు.

దీనికి సరైన కౌంటర్ ఇచ్చే వారెవరూ లేకపోవటం.. గడిచిన కొంతకాలంగా అవన్నీ నిజాలుగా చెలామణీ కావటంతో పాటు.. ఏపీ ప్రజల్లో తమ ప్రాంతం మీద అభిమానం కంటే కూడా.. తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేయటం వల్ల.. ఏపీ పాలకుల పేరుతో కేసీఆర్ తిట్టే తిట్లను.. ఎవరినో తిట్టినట్లుగా ఫీల్ అవుతారే తప్పించి.. ఇంకోలా అస్సలు భావించారు. పాలకులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారన్న సింఫుల్ లాజిక్ ను ఆంధ్రా ప్రాంత వాసులు ఎప్పుడు గుర్తించరు కదా?

ఇంతకూ అయిపోయిన పెళ్లి గురించి ఇప్పుడెందుకు చర్చ? అంటారా? అక్కడికే వస్తున్నాం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి మాజీ మంత్రి.. టీడీపీ నేత.. రాయలసీమ ప్రాంతానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి సందడి చేశారు. వచ్చిన వ్యక్తి వచ్చామా? చూశామా? కలిసిన పాత్ర మిత్రులతో మాట్లాడామా? తమ దారిన తాము వెళ్లామా? అన్నది లేకుండా.. మీడియాతో ముచ్చట్లు పెట్టేశారు. ఈ సందర్భంగా ‘మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాయం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్ రెడ్డి అడిగితే ఒప్పుకోలేదు’ అంటూ పాత ముచ్చట్లను మొదలు పెట్టారు.

తెలంగాణవాదులు మొదట్నించి.. తమను తాము పాలించుకుందామని.. తమ సొంత రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మాత్రమే ఉండాలని అనుకున్నారే కానీ.. ఏపీలో భాగమైన సీమను కలుపుకోవాలని వారెప్పుడూ అనుకోలేదు. ఆ మాటకు వస్తే.. తెలంగాణ కల్చర్ కు.. సీమ కల్చర్ కు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు కూడా. చారిత్రకంగా కూడా ఈ రెండు ప్రాంతాలు ప్రత్యేకంగా కలిసి ఉన్నది లేదు.

ఉద్యమవేళ.. రాయల తెలంగాణను తెలంగాణ వాదులు.. పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయన్న విషయాన్ని జేసీ మర్చిపోతే ఎలా? మేం మిమ్మల్ని కలుపుకోమని తెగేసి చెప్పిన తర్వాత.. అధికారికంగా విడిపోయిన ఏడున్నరేళ్ల కాలం తర్వాత.. మళ్లీ పాత రాగాన్ని ఆలపిస్తే ఎవరికి మాత్రం మండదు? జేసీ లాంటి నేతలు తమ పైత్యాన్ని ప్రదర్శించటం ద్వారా జరిగే నష్టం ఏమంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ వాసులంతా రాబోయే రోజుల్లో తిట్లు తినాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కొన్ని విషయాల్ని కొందరు ప్రస్తావించకుంటే బాగుంటుందన్న దానికి నిదర్శనంగా.. రాయల తెలంగాణ గురించి జేసీ లాంటి వాళ్లు మాట్లాడటం.. విభజన గురించి ఇప్పుడు మాట్లాడి.. అనవసరంగా తిట్టించుకోవటం మినహా మరింకేమీ ఉండదు. కాబట్టి.. జేసీ లాంటి పెద్ద మనుషులు తమ పాత పరిచయస్తుల్ని కలిసి ఏదైనా చెప్పుకోవాలంటే ప్రైవేటుగా చెప్పుకుంటే సరి. అలా కాకుండా ఇలా మాట్లాడి.. అందరి చేత నాలుగు మాటలు అనిపించేలా చేయటం ఏ మాత్రం సబబు కాదన్నది ఆయనకు ఎందుకు అర్థం కావట్లేదు?