Begin typing your search above and press return to search.

మోడీ , షా ఓవర్ యాక్షన్ తోనే 'దీదీ' పార్టీకి ఘనవిజయం సాధ్యమైందా ?

By:  Tupaki Desk   |   3 May 2021 5:30 AM GMT
మోడీ , షా ఓవర్ యాక్షన్ తోనే దీదీ పార్టీకి ఘనవిజయం సాధ్యమైందా ?
X
బెంగాల్ ఫైటర్ మరోసారి తన పోరాట పటిమ చూపి , తాను దెబ్బ తినే పులిని కాదు మాటు వేసి దెబ్బ కొట్టే పులిని అంటూ పార్టీ ని ఘన విజయం వైపు నడిపించింది. వీల్ చైర్ టు సీఎం చైర్ అంటూ వచ్చిన కామెంట్స్ ను నిజం చేస్తూ పార్టీ ని అఖండమైన మెజారిటీ తో గెలిపించింది. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డే పాలించాలని ప్రచారంలో ముఖ్యమైన అస్త్రంగా ప్రయోగించింది. మోదీ-అమిత్ షా ఔట్ సైడర్స్‌ అని, తాను పక్కా లోకల్ అని చెప్పడమే కాదు, బెంగాల్ ప్రజల్లోనూ అదే తీర్పు వ్యక్తమయ్యేలా చేసింది. విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించిన దీదీ సక్సెస్ వెనుక పనిచేసిన కీలక అంశాల్ని ఒకసారి పరిశీలిస్తే ...

అత్యంత సులభంగా గెలిచే స్థానాన్ని వదిలి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడం పెద్ద సాహసమే. దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన సువెందు అధికారి ప్రాబల్యాన్ని ఆమె ఢీకొట్టి నిలబడగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ మొదలై నందిగ్రాం పోలింగ్ ట్రెండ్స్ వచ్చేటప్పటికీ ,మమత అక్కడ గెలవడం కష్టమేనని చాలామంది భావించారు. మధ్యలో పుంజుకున్నప్పటికీ అంతిమంగా ఓటమి తప్పలేదు. అయితే నందిగ్రాంలో పోటీ దీదీకి కలిసొచ్చింది. ఒకవేళ దీదీ ఆత్మరక్షణ వ్యూహంలో భాగంగా నందిగ్రాంతో పాటు మరో చోటు నుంచి కూడా పోటీ చేసి ఉంటే, ఆమెను ఓటమి భయం వెంటాడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేవి. అలా జరగకుండా, రిస్క్ అని తెలిసినప్పటికీ ఆమె నందిగ్రాంలో మాత్రమే పోటీ చేశారు. నందిగ్రాంలో మమత ఓడిపోవచ్చు గానీ బెంగాల్‌ లో హ్యాట్రిక్ కొట్టేందుకు అది తోడ్పడింది.

మమత బెనర్జీకి సమవుజ్జీగా,ధీటుగా నిలబడే ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీకి లేకపోవడం దీదీకి కలిసొచ్చిందని చెప్పాలి. దీదీ కాకుండా మరో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆప్షన్ ప్రజల ముందు లేదు. పైగా సింగూర్,నందిగ్రాం వంటి ప్రజా ఉద్యమాల్లో నుంచి ఎదిగొచ్చిన నేపథ్యం ఆమెది. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న ఆమె నినాదానికి, ఆమె గత రాజకీయ కార్యాచరణకు బ్యాలెన్స్ కుదిరింది. ఇన్‌ సైడర్ కి ఔట్‌ సైడర్ కి మధ్య యుద్ధం అంటూ ఆమె చేసిన ఓ నినాదం కూడా వర్కౌట్ అయింది. వాళ్లు వస్తారు పోతారు... కానీ మీరూ,నేనూ ఎప్పుడూ ఇక్కడేం ఉంటాం మిత్రమా అంటూ బెంగాల్ ప్రజలకు మమత పదేపదే విజ్ఞప్తి చేస్తారు. అలాగే బీజేపీ మత రాజకీయాలకి తెర తీసినా కూడా ,, మమత తమకి అందరూ ఒక్కటే అంటూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకానొక సమయంలో తాను హిందువునేనని, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళను అని కాబట్టి హిందూ ధర్మం గురించి తనకు ఎవరూ చెప్పే పని లేదని , దీనితో హిందువుల్లోకి బలమైన సంకేతాలు పంపించగలిగింది. అలాగే రాష్ట్రంలో అనేక మతాల వారికి అమలు చేస్తున్న సంక్షేమాల గురించి చెప్పి వారిని తమవైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది. సంక్షేమ పథకాల హామీలు కూడా దీదీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ కారణాలతో పాటుగా మరో ముఖ్యమైన కారణం .. దీదీ బంపర్ విక్టరీ కి కారణమైంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అదే .. ప్రధాని మోడీ , అమిత్ షా ఓవర్ యాక్షన్. దీదీ పై విజయం సాధించి , బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే తీరని కలతో మొత్తం బీజేపీనే బెంగాల్ లో తిష్ట వేసింది. ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించేలా చేసి , బడా బడా నేతలు ఎన్నో ర్యాలీలు నిర్వహించి ఇక మమత పని అయిపోయింది , వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ మమత పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది అన్నట్టుగా మోడీ , షా లు రెచ్చిపోయారని రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. కానీ, మమత మాత్రం వారిపై ఓ వైపు విమర్శలు చేస్తూనే మరోవైపు విజయం కోసం చేయాల్సింది అంతా చేసింది. పార్టీని అఖండ మెజారిటీ తో గెలిపించుకుంది. మమత పార్టీ గెలుపులో మోడీ , షా ఓవర్ యాక్షన్ కూడా కీలక పాత్ర పోషించింది అని చర్చించుకుంటున్నారు.