Begin typing your search above and press return to search.

ఏపీలో న్యూడ్ కి పర్మిషన్ వచ్చేసిందా...?

By:  Tupaki Desk   |   9 Aug 2022 11:30 AM GMT
ఏపీలో న్యూడ్ కి పర్మిషన్ వచ్చేసిందా...?
X
నగ్నత్వం ఇపుడు ఒక ఫ్యాషన్. అసలు పుట్టినపుడు బట్ట కట్టలేదు, పోయేటపుడు కూడా ఉండదు, నడుమ ఎందుకు అని చాలా మంది వేదాంతులు అంటూ ఉంటారు. కానీ నాగరీక సమాజంలో నగ్నత్వం అంటే కుదిరే వ్యవహారం కాదు. ఆదిమ జాతుల నుంచి కూడా ఆకులు అలమలు చుట్టుకుని ఒంటికి కప్పుకుని కట్టుబాట్లతో సాగుతున్న సమాజం మనది.

అయితే ఇపుడు మాటలలో కపటత్వం కనిపిసోంది. చేతలలలో నగ్నత్వం తాండవిస్తోంది. నగ్నంగా ఉండడం అంటే బరి తెగించినట్లే. కానీ అదే ఇపుడు దూకుడుకు మారు పేరుగా చెప్పుకుంటున్నారు. ఎంత న్యూడ్ గా ఉంటే అంత గుర్తింపు. అయితే ఇక్కడ కూడా విచ్చలవిడితనానికి ఒక లెక్క ఉంది. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా నగ్నంగా అవతారాలు చూపిస్తే జనాలు నొచ్చుకుంటారు. భయపడతారు కూడా.

అది అతి జుగుప్సాకరంగా కూడా ఉంటుంది. ఇపుడు ఏపీలో చూస్తే అలాంటి కేసే ఒకటి విపక్షాలకు చేత చిక్కింది. దాని మీద పీక్కోలేక లాక్కోలేక అధికార పార్టీ సతమతమవుతూ పిల్లిమొగ్గలు వేస్తోంది. తప్పు చేస్తే ఎంతటి వారి మీద అయినా చర్యలు తప్పవని ఒక వైపు చెబుతున్న వైసీపీ పెద్దలే మరో వైపు గోరంట్ల చేసిన దాంట్లో పెద్దగా తప్పేముంది అని కూడా అంటున్నారు.

కేసులు పెట్టకపోతేనో లేక ఎవరైనా ఫిర్యాదు చేయలేదనో నగ్నంగా రోడ్ల మీద సంచరిస్తే ఒప్పుకుంటారా అన్నదే ఇక్కడ సూటి ప్రశ్న. ఇది నాగరీక సమాజం. దీనికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఒక పద్ధతి ఉంది. ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ గారు నగ్నంగా వీడియోలు తీసి దొరికారు అంటే దాని మీద దర్యాప్తు జరిపించకుండా అదేమీ పెద్ద నేరం కాదని అనడం మొదలెడితే ఇక సమాజం ఎటు పోతుంది అన్నదే మేధావుల మాట ఉంది అంటున్నారు.

నగ్నత్వం తప్పు కాదు, ఎవరైనా నాలుగు గోడల మధ్య ఇలాంటివి చేసుకోవచ్చు అని చెబుతున్నారా లేక మా కంటబడేవరకూ ఎవరు ఎలా తిరిగినా పట్టించుకోమని చెబుతున్నారా అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న సూటి ప్రశ్న. సదరు ఎంపీ గారి న్యూడ్ వీడియోల వల్ల ఏమిటి నష్టం అని కూడా అంటున్నారు. కానీ ఈ నష్టం రూపాయల్లో కాదు, ఆస్తులలో కాదు, నైతికత మీద ఆధారపడి ఉంది. ఇది సమాజానికి బరితెగింపు నేర్పుతుంది. అందరూ అదే దారిన వెళ్తే అపుడు సమాజం తల్లకిందులు అవుతుంది.

మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే దానికి బాధ్యత తీసుకునేది ఎవరు. ఒక తప్పు జరిగితే దాన్ని సరిదిద్దలసినది ప్రభుత్వాలు. అయితే తప్పు అని జరిగినపుడు చర్యలు ఉండాలి. దాని మీద విచారణ కూడా ఉండాలి. ఆ విషయంలో కూడా తప్పు లేదు. కానీ అసలు అది పెద్ద తప్పే కాదు అని మాట్లాడితేనే అతి పెద్ద తప్పు అవుతుంది. మరి సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే నాడు చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికారు. ఆయన గొంతు అలా అంతా విన్నారు. ఆ కేసు ఈ రోజుకీ అలాగే ఉంది అంటూ కొత్త పాయింట్ లాగారు.

నిజమే ఆ కేసును కూడా ఎవరూ సమర్ధించరు. కానీ ఇపుడు ఈ న్యూడ్ కేసు లో చర్యలు ఉంటాయా ఉండవా ఉంటే ఎపుడు అని చెప్పి ఇంకా ఎన్ని అయినా మాట్లాడవచ్చు అంతే తప్ప ఇది పెద్ద విషయమే కాదు అన్నట్లుగా లైట్ తీస్కోమంటే సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్లు అని మేధావులు అంటున్నారు. మరి దీనికి ఏలిన వారే జవాబు ఇవ్వాలేమో. ఇలాంటి ప్రకటనల వల్ల ఏపీలో న్యూడ్ కి పర్మిషన్ వచ్చేసిందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటే తప్పు ఎవరిదో మరి.