Begin typing your search above and press return to search.

వైసీపీ లోకి దేవినేని?... బాబు దీక్ష అట్టర్ ఫ్లాపే నా?

By:  Tupaki Desk   |   13 Nov 2019 3:12 PM GMT
వైసీపీ లోకి దేవినేని?... బాబు దీక్ష అట్టర్ ఫ్లాపే నా?
X

మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరం గా ఓడి పోయిన తెలుగు దేశం పార్టీ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇలాంటి దెబ్బలు ఆ పార్టీ కి కొత్తేమీ కాకున్నా... తొలుత ఎన్నికల్లో ఘోర పరాభవం, ఆ వెంటనే కీలక నేతలంతా క్యూ కట్టి మరీ పార్టీ కి గుడ్ బై చెబుతున్న ప్రస్తుత పరిణామాలు ఆ పార్టీ కి అశనిపాతమేనని చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో కృష్ణా జిల్లా... అందులోనూ ప్రత్యేకించి విజయవాడ నగరంలో పార్టీ కి సంబంధించి కీలక నేతగా ఉన్న దేవినేని అవినాశ్ పార్టీ కి గుడ్ బై చెప్పడం ఖాయమంటూ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు. అది కూడా ఇసుక దీక్ష అంటూ గురువారం చంద్రబాబు చేపడుతున్న దీక్ష కు దూరంగా ఉండటమే కాకుండా దీక్ష రోజునే అవినాశ్ నుంచి కీలక ప్రకటన వస్తున్నదంటూ వినిపిస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి.

దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడి గా కాంగ్రెస్ పార్టీ లో ఉండగానే విజయవాడ నగరం లో కీలక నేతగా ఎదిగిన అవినాశ్... మొన్నటి ఎన్నికల కు కాస్తంత ముందు గా టీడీపీ లో చేరారు. అవినాశ్ రాజకీయ భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకునే నాడు నెహ్రూ తన కుమారుడి తో కలిసి టీడీపీ లో చేరారు. ఎన్నికల్లో తనకు బలమున్న గన్నవరం గానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గం గానీ కేటాయించాలని అవినాశ్ డిమాండ్ చేస్తే... ఆయన డిమాండ్ల ను పక్కన పెట్టిన చంద్రబాబు... కొడాలి నాని ని ఓడించడానికి ఆయన ను గుడివాడ కు పంపారు. ఈ క్రమంలో గుడివాడ లో జరిగిన హోరాహోరీ పోరు లో కొడాలి నాని చేతిలో అవినాశ్ చిత్తు గా ఓడిపోయారు. అప్పటి నుంచే అవినాశ్... టీడీపీలో తనకు భవిష్యత్తు లేదన్న కోణం లో విశ్లేషణలు ప్రారంభించారట.

ఈ విషయాన్ని వైసీపీ కీలక నేతలు జగన్ కు చేర వేయగా... ఆయన వేచి చూద్దామన్న రీతిలో సాగారు. అయితే ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే గా ఎన్న వల్లభనేని వంశీమోహన్ టీడీపీ కి రాజీనామా ద్వారా చంద్రబాబు కు గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు ఇసుక దీక్షంటూ నగరం లో చంద్రబాబు భారీ దీక్షను చేసేందుకు నిర్ణయించారు. గురువారం ధర్నా చౌక్ కేంద్రంగా చంద్రబాబు 12 గంటల దీక్ష కు కూర్చోనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కు మరో గట్టి షాకిచ్చేలా ఇటు వైసీపీ, అటు అవినాశ్ వర్గం వ్యూహం రచించినట్టు గా తెలుస్తోంది. బుధవారం సాయంత్రమే అవినాశ్ తన ఇంటి లో అనుచర వర్గం తో కీలక భేటీ నిర్వహించారట. ఈ భేటీలో కార్యకర్తలంతా వైసీపీ లో చేరి పోదామంటూ అవినాశ్ కు చెప్పేశారట. ఇక అవినాశ్ ను ఆహ్వానించేందుకు వైసీపీ కూడా రెడీగానే ఉందట. ఈ నేపథ్యం లో చంద్రబాబు దీక్ష చేసే రోజునే అవినాశ్ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడేలా రంగం సిద్ధమవుతున్నట్లు గా తెలుస్తోంది. చంద్రబాబు దీక్ష కు అవినాశ్ దూరం గా ఉంటే... విజయవాడ నుంచి పెద్ద గా కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా ఇటు చంద్రబాబు దీక్ష చేస్తుండగానే అవినాశ్ నుంచి ఓ కీలక ప్రకటన వస్తే... దీక్ష కు వచ్చే జనం మరింత పలచనబడతారన్న వార్తలూ టీడీపీ శ్రేణులను కలవరానికి గురి చేస్తున్నాయి.