Begin typing your search above and press return to search.

తెలంగాణ మందుకు ఏపీలో య‌మ గిరాకీ

By:  Tupaki Desk   |   25 May 2020 8:15 AM GMT
తెలంగాణ మందుకు ఏపీలో య‌మ గిరాకీ
X
స్వ‌రాష్ట్రంలో అధిక ధ‌ర‌లు.. మ‌ద్యం విక్ర‌యాల‌కు తీవ్ర ఆంక్ష‌లు ఉండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దు ప్రాంత‌వాసులు తెలంగాణపై దృష్టి సారించారు. తెలంగాణ‌లో త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యించ‌డంతో పాటు నిబంధ‌న‌లు తీవ్రంగా లేవు. దీంతో తెలంగాణ‌తో స‌రిహ‌ద్దు ప్రాంతాలు ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులు తెలంగాణ‌లోకి వెళ్తున్నారు. తెలంగాణ‌లో మ‌ద్యం కొనుగోలు చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీసుకెళ్తున్నారు. అక్క‌డ విక్ర‌యించుకుని ల‌బ్ధి పొందుతున్నారు. దీంతో తెలంగాణ మందు వారికి మాంచి కిక్ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోరుకున్న‌ బ్రాండ్ మందు ల‌భించ‌డం లేదు. కొన్ని బ్రాండ్స్‌కు మాత్ర‌మే ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో మందుబాబులు త‌మ బ్రాండ్ మందు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి అక్ర‌మార్కులు వారి బ్రాండ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మద్యం మాఫియా తెర‌పైకి వ‌చ్చేసింది. సరిహద్దులు దాటి బ్రాండెడ్‌ బాటిళ్లు తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయి.

దీంతో పెట్టుబ‌డి లేకుండానే వ్యాపారం జోరుగా సాగుతోంది. అర్థ‌రాత్రి నుంచి తెల్లవారే వ‌ర‌కు లక్షలాది విలువైన మద్యం తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి అడుగు పెడుతోంది. ఆ స‌మ‌యంలోనే ఏపీలోని వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లుతోంది. వారం రోజులుగా ఈ దందా మరింత పెరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌ర‌లించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మందు స‌ర‌ఫ‌రా అవుతోంది.

ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని చింతలపూడి, పోలవరం నియోజకవర్గ సరిహద్దుల్లో తెలంగాణ రాష్ట్ర స‌రిహద్దు ఉంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా స‌రిహ‌ద్దుగా ఉంది. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం మాఫియాకు కలిసొస్తోంది. బైకులు, ఖరీదైన కార్లలో మ‌ద్యం స‌ర‌ఫ‌రా జ‌రుగు‌తోంది. తెలంగాణ నుంచి బ్రాందీ, విస్కీ తీసుకువచ్చి మూడు రెట్లు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. ప్రత్యేకించి బ్రాందీ రకాలు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ఈ వ్యాపారం వెనుక పెద్ద నాయ‌కులు ఉన్న‌ట్లు స‌మాచారం.

దశల వారీగా మద్యం నిషేధం చేస్తామని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించి దానికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటుండడంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం కొర‌త ఏర్ప‌డింది. బ్రాండ్‌లు కొద్దిమొత్తంలో ఉన్నాయి. 75 శాతం మేర ధరలు పెంచిన నేప‌థ్యంలో ఇక్క‌డ కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ నుంచి అక్రమ రవాణా జ‌రుగుతుంద‌ని భావించి ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటుచేశారు. అయితే వీరిని త‌ప్పించుకుని రాత్రి వేళల్లో ఈ వ్యాపారం సాగుతోంది.

తెలంగాణ నుంచి ఈ విధంగా అక్ర‌మ ర‌వాణా ఉంది.
- తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన ఆరు లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్ ప్ర‌క‌టించారు. ఖమ్మం జిల్లా నుంచి తీసుకువ‌చ్చిన మ‌ద్యం దాబా రెస్టారెంట్‌లో నిల్వ చేసిన విష‌యాన్ని గుర్తించి దాడులు చేశారు. ఆరు లక్షల విలువైన 1,240 బ్రాండెడ్‌ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చొదిమెళ్ల వద్ద వాహనాల తనిఖీ స‌మ‌యంలో రూ.21 వేల విలువైన 61 మద్యం బాటిళ్లు ల‌భించాయి.

- చింతలపూడి వద్ద తెలంగాణ సరిహద్దు గంగారం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.40 వేల విలువైన మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- మరో కేసులో రూ.10 వేలు విలువైన 43 మద్యం సీసాలు ల‌భించాయి.