Begin typing your search above and press return to search.

కోవిడ్ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందే.. మోడీకి షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   22 April 2021 4:07 AM GMT
కోవిడ్ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందే.. మోడీకి షాకిచ్చిన హైకోర్టు
X
కరోనా కల్లోలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్న కరోనా రోగుల విషయంలో ఢిల్లీ హైకోర్టు తీవ్ర మనస్థాపం చెందింది. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని నిలదీసింది. ఆక్సిజన్ లేని కారణంగా ప్రజలు చనిపోవాలా? అని ప్రశ్నించింది.ఇంతటి ఘోరాన్ని చూస్తూ మేం కూర్చోవాలా? అని హైకోర్టు మండిపడింది.

‘అడుక్కుంటారో.. అరువు తెస్తారో.? మాకు అనవసరం అని.. అన్ని ఆస్పత్రులకు వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రసర్కార్ ను ఢిల్లీ హైకోర్టు కడిగిపారేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రులన్నీ రోగులతో నిండి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కొరతకు పరిష్కారం చూపాలంటూ ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రుల యాజమాన్యం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం తీరుపై ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కేంద్రం అమలు చేయలేదు. దీంతో బుధవారం కేంద్రం తరుఫున న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. ప్రజల జీవించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదని.. ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాల్సిందేనని ఆదేశించింది.

రతన్ టాటా లాంటి వారు ఆక్సిజన్ ఇస్తామంటున్నారని.. ప్రభుత్వం ఆధీనంలో పెట్రోలియం కంపెనీలున్నాయని.. ఎయిర్ ఫోర్స్, ఇతర బలగాలున్నా.. కేంద్రం ఆక్సిజన్ ఎందుకు సరఫరా చేయడం లేదని హైకోర్టు నిలదీసింది. ప్రజల ప్రాణాల కోసం వెంటనే పరిశ్రమల్లోని ఆక్సిజన్ మొత్తాన్ని మెడికల్ ఆక్సిజన్ గా మార్చి సరఫరా చేయాలని సూచించింది. అడుక్కుంటారా? బతిమిలాడుతారా? దొంగిలిస్తారా? అన్నది మాకు అనవసరమని.. కరోనా రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.