Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు ముఖ్యులు కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లింది అందుకేనా?

By:  Tupaki Desk   |   8 July 2020 9:15 AM GMT
ఆ ఇద్దరు ముఖ్యులు కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లింది అందుకేనా?
X
చెప్పేదానికి చేసే దానికి ఏ మాత్రం పోలిక ఉండదనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పక తప్పదు. మీడియాలో వచ్చే వార్తలకు.. దాని వెనుకున్న అసలు ఉద్దేశానికి ఏ మాత్రం సంబంధం ఉండదన్న మాట కేసీఆర్ జమానాలో ఎంత నిజమన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిన్నటికి నిన్న ప్రధాన మీడియాలో ఒక వార్త పబ్లిష్ అయ్యింది. దాని సారాంశం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలు ముఖ్యమంత్రి ఫాంహౌస్ అయిన ఎర్రవెల్లికి వెళ్లారని. అక్కడ ఏకంగా రెండు గంటలకు పైనే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారన్న వార్తలు వచ్చాయి.

ఇంతకీ ఈ ఇద్దరు ప్రముఖులతో ముఖ్యమంత్రి ఏయే అంశాల్ని చర్చించారన్న దానికి చెప్పిందేమంటే.. మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం.. ఖర్చులు ఎలా ఉన్నాయి..? పంటల సాగు ఎలా ఉంది? బియ్యం పంపిణీ ఎలా సాగుతోంది? మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారు? లాంటి అంశాల్ని చర్చించినట్లుగా పేర్కొన్నారు. తరచి చూస్తే.. ఇందులోని ఏ అంశానికి రాష్ట్ర డీజీపీకి సంబంధం లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఇద్దరు ప్రముఖులు కలిసి ఫాంహౌస్ కు వెళ్లటంపై ఆసక్తి నెలకొన్నా.. ఎవరూ కూడా ఎందుకు వెళ్లినట్లు? అన్న సందేహాన్ని వ్యక్తం చేయలేదు.

అయితే.. సోమవారం వారు వెళ్లి వచ్చిన గంటల తర్వాత చేపట్టినకార్యక్రమం.. ఆ సందర్భంగా ఈ ఇరువురు కీలక అధికారులు వ్యవహరించిన తీరుతో కానీ.. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశం మర్మం అర్థం కాలేదని చెబుతున్నారు. సచివాలయాన్ని కూల్చివేసేందుకు సోమవారం అర్థరాత్రి ముహుర్తంగా పెట్టుకున్న వేళ.. ఆ కార్యక్రమం ఎలా సాగుతోంది? అందుకు అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి? పక్కా ప్లానింగ్ ఏమేం జరగాలి? కూల్చివేతను అడ్డుకోవటానికి ఆందోళనలు చోటు చేసుకోకకుండా ఏమేం చేయాలన్న అంశాలపై చర్చించేందుకే అత్యున్నత అధికారుల్ని తన ఫాంహౌస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. వారిద్దరితో సీఎం భేటీకి కేసీఆర్ తనకు తగినట్లుగా మార్చేసినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. చెప్పే దానికి చేసే దానికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉండటం కేసీఆర్ జమానాలోనే కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.