Begin typing your search above and press return to search.

మహమ్మారి ఎఫెక్ట్ .. బోసిపోయిన భాగ్యనగర రోడ్లు, పల్లెబాట పట్టిన ప్రజలు !

By:  Tupaki Desk   |   4 July 2020 10:10 AM GMT
మహమ్మారి ఎఫెక్ట్ .. బోసిపోయిన భాగ్యనగర రోడ్లు, పల్లెబాట పట్టిన ప్రజలు !
X
తెలంగాణలో రోజురోజుకి మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీనితో చాలామంది సొంత ఊర్లకు వెళ్ళిపోగా, ఇప్పటికీ ఏపీ బాట పడుతున్న వారు చాలామందే ఉన్నారు. హైదరాబాద్ రోడ్లు ఎలాంటి రద్దీ లేకుండా నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటివరకు 16,078 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నమోదైన వైరస్ కేసుల్లో 15750 యాక్టివ్ గా ఉండగా 305 మంది మాత్రమే ఇప్పటివరకు రికవర్ అయ్యారు.హైదరాబాద్ లో వైరస్ మరణాలు చూసినట్లయితే 23 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. రోజు రోజు కు భాగ్యనగరంలో కేసులు పెరుగుతున్న తీరుతో భయాందోళనలకు గురవుతున్న భాగ్యనగర వాసులు సొంత గ్రామాలకు పయనమయ్యారు. అలాగే , స్థానికంగా నివాసం ఉండే హైదరాబాదీలు ఇళ్లకే పరిమితం అవడంతో భాగ్య నగర రహదారులు వెలవెలబోతున్నాయి.

గతంలో హైదరాబాద్ లో ప్రయాణం చేయాలంటే విపరీతమైన ట్రాఫిక్ తో ఎక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయాయి. ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయాలన్న ఈజీగా ప్రయాణం చేసేలాగా నిర్మానుష్యంగా తయారయ్యాయి. తాజా పరిణామాలతో రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. లాక్ ‌డౌన్‌ సమయంలో హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం హైదరాబాదులో అదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో గత 15 రోజుల నుంచి చూసినట్లయితే ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి

అలాగే , హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాలతో హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నసెటిలర్స్ ఏపీ బాట పట్టారు. సొంత ఊర్లకు పయనమయ్యారు. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఉండటం, అలాగే కొందరు ఉద్యోగాలు పోగ్గోట్టుకోవటంతో సొంత ఊర్ల బాట పట్టారు. హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో చూసినా ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతుండడం, ఇక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందడం లేదన్న ఆందోళన, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావన, టెస్టుల విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడి ఉందన్న అభిప్రాయం వెరసి భాగ్యనగర్ నిర్మానుష్యం గా తయారవుతుంది. భాగ్యనగర్ లో సెటిల్ అయిన వారు బతికుంటే బలుసాకు తిని అయినా బతకవచ్చని సొంత ఊర్ల బాటపట్టారు.