Begin typing your search above and press return to search.

గాంధీలో కిటకిటలాడుతోన్న వైరస్ పేషేంట్స్..ఒత్తిడిలో వైద్య సిబ్బంది

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:14 AM GMT
గాంధీలో కిటకిటలాడుతోన్న వైరస్ పేషేంట్స్..ఒత్తిడిలో వైద్య సిబ్బంది
X
తెలంగాణలో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజారవాణా మొదలుకావడంతో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. పరిధికి మించి రోగులు అడ్మిట్‌ అవుతుండటంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే వైరస్‌ బారిన పడిన రోగుల్లో 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోవడం, గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 200 మంది వస్తుండటం, మూడు నెలలుగా విరామం లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో హైపర్ ‌టెన్షన్, మధుమేహం, కేన్సర్, కిడ్నీ, గుండె, కాలేయ, సమస్యలతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. వీరిలో వృద్ధులసంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సాధారణ రోగులతో పోలిస్తే..రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, బీపీ, షుగర్‌ బాధితులపై కరోనా వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతున్న కారణంగా అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.

గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో వెయ్యి పడకల సామర్థ్యం మాత్రమే ఉంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రిలో పడకల సామర్థ్యాన్ని 1500కు పెంచారు. వారం రోజుల నుంచి రోజుకు సగటున 100 కి పైగా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని పడకలన్నీ దాదాపు నిండిపోయాయి. దీంతో అదనంగా 350 పడకలు ఏర్పాటు చేసేందుకు గాంధీ యంత్రాంగం సిద్ధమైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారిని ఎక్కడ పెట్టాలనే అంశంపై డాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు.

పడకల పరిధి పెంచినా , దానికి తగ్గ రీతిలో వైద్య సిబ్బందిని కూడా నియమించక పోవడంతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. వైద్యులు రాసిన మందులను మంచంపై పడేయడం, ఆహారాన్ని కనీసం చేతికి కూడా ఇవ్వకుండా ఓ చోట వదిలి వెళుతుండడం లాంటి ఘటనలు రోగులను మానసికంగా కుంగదీస్తున్నాయి. వైరస్ సెంటర్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి మే 3వ తేదీ వరకు వైరస్ పాజిటివ్‌ లక్షణాలతో 3020 మంది రోగులు చేరగా, వీరిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 448 ఉన్నారు.